
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ మైదానంలో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. లంచ్ సమయానికి 25 ఓవర్లలో 3 వికెట్లకు 74 పరుగులు చేసింది. జానీ బెయిర్స్టో 28 పరుగులు, బెన్ స్టోక్స్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓ దశలో 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును స్టోక్స్, బెయిర్స్టోలు ఆదుకున్నారు. ఈ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మొదటి సెషన్ను ముగించారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు.. మొహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. మూడో టెస్ట్లాగే ఇంగ్లండ్ను స్పిన్తో బెదరగొట్టాలనుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స్పిన్నర్ అక్షర్ పటేల్ను త్వరగానే బౌలింగ్కు దించాడు. ఈ ఎత్తుగడ ఫలించింది. అక్షర్ వేసిన 5వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ డొమినిక్ సిబ్లీ క్లీన్ బోల్డ్ అయ్యాడు. అక్షర్ వేసిన బంతి సిబ్లీ బ్యాట్ మధ్యలో నుంచి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. 8 బంతులు ఎదుర్కొన్న అతడు రెండు రన్స్ చేశాడు.
మరికొద్ది సేపటికే ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ తాను వేసిన రెండో ఓవర్లో 9 పరుగులు చేసిన జాక్ క్రాలే భారీ షాట్కు యత్నించి మొహ్మద్ సిరాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇక హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ను కోలుకొని దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతికే కెప్టెన్ జో రూట్ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్ 30 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది.
30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లిష్ టీమ్ను బెన్ స్టోక్స్, జానీ బెయిర్స్టో ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఇండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో లంచ్ లోపు ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోలేదు. తనకు అలవాటైన భారత పిచ్లపై బెయిర్స్టో అద్భుతంగా ఆడుతున్నాడు. మరోవైపు ఐపీఎల్ అనుభవం ఉన్న స్టోక్స్ కూడా ఆచితూచి ఆడుతూ పరుగులు చేస్తున్నాడు. లంచ్ సమయానికి 25 ఓవర్లలో 3 వికెట్లకు 74 పరుగులు చేసింది.