నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు:
నాలుగో టెస్టుకు ముందు బెన్ ఫోక్స్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... 'నిజం చెప్పాలంటే మూడో టెస్టులో మేం పూర్తిగా విఫలమయ్యాం. చెన్నై, మొతేరా పిచ్లు చాలా కష్టతరమైనవి. కానీ టీమిండియా మాకన్నా బాగా ఆడింది. భారత జట్టులో పలువురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి వారు వైవిధ్య బంతులు వేస్తారు. దాంతో వారి బౌలింగ్కు మా వద్ద సమాధానం కరవైంది. ఇక రాబోయే మ్యాచ్లో మరింత జాగ్రత్తగా ఆడి వారిని ఎదుర్కొని భారీ స్కోర్ సాధించాలి' అని అన్నాడు.
సరైన మార్గం అన్వేషించాలి:
'మూడో టెస్ట్ మ్యాచ్లో ఎలాంటి పిచ్ ఉండబోతుందనే విషయంపై మాకో స్పష్టమైన అవగాహన ఉంది. తొలి బంతి నుంచే విపరీతమైన టర్నింగ్ ఉంటుందని మేం అనకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో బాగా ఆడడానికి సరైన మార్గం అన్వేషించాలి. గత రెండు టెస్టుల్లోనూ పిచ్ కఠినంగా ఉంది. ఇలాంటి వాటిని ముందెప్పుడూ చూడలేదు. పింక్బాల్ టెస్టులో బంతి మరీ ఎక్కువగా తిరిగింది. ఇలాంటి పిచ్లపై కీపింగ్ చేయడం కష్టంగా మారింది. వరుసగా రెండు టెస్టులు ఓటమిపాలైనా ఇప్పటికీ మాకు సిరీస్ డ్రా చేసుకునే అవకాశం ఉంది' అని బెన్ ఫోక్స్ చెప్పాడు. చివరి మ్యాచ్లో మంచి ప్రదర్శన చేసి 2-2తేడాతో తిరిగి స్వదేశానికి వెళితే బాగుంటుందని ఫోక్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రాక్టీస్ మొదలు:
డేనైట్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 112 పరుగులు చేయగా.. భారత్ 145 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 81 పరుగులకే ఆలౌటవ్వడంతో.. భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టు మొతేరా స్టేడియంలో మార్చి 4న ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు.