హైదరాబాద్: సుదీర్ఘ పర్యటన కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో టీమిండియా గురువారం నుంచి రెండో టెస్టులో తలపడనుంది. ఈ టెస్టుకు ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది.
రెండో టెస్టు నిమిత్తం కోహ్లీసేన ఇప్పటికే లార్డ్స్కు చేరుకుంది. లార్డ్స్లో ఇంగ్లండ్తో జరగనున్న రెండో టెస్ట్కు ముందు మంగళవారం భారత క్రికెట్ జట్టు నెట్స్లో ప్రాక్టీస్ చేసింది. ఇటీవలే భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్న క్రికెట్ లెజెండ్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ నెట్స్లో బౌలింగ్ చేశాడు.
ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అర్జున్ బౌలింగ్ చేశాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ లెఫ్టామ్ పేస్బౌలర్ శామ్ కుర్రన్ భారత బ్యాట్స్మెన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో నెట్స్లో లెఫ్టామ్ బౌలరే అయిన అర్జున్తో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి బౌలింగ్ చేయించాడు.
#TeamIndia Captain @imVkohli gearing up for the 2nd Test match at @HomeOfCricket.#ENGvIND pic.twitter.com/pii9cogOXS
— BCCI (@BCCI) August 7, 2018
అర్జున్ బౌలింగ్లో భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేయడం బ్యాట్స్మెన్కు ఎంతగానో ఉపయోగపడనుంది. తొలి టెస్టులో 31 పరుగులతో ఓడిన టీమిండియా లార్డ్స్ వేదికగా జరిగే రెండో టెస్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆటగాళ్లందరూ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రాక్టీస్ చేశారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి లార్డ్స్ పిచ్ను పరిశీలించాడు.
పిచ్ గురించి క్యూరేటర్ను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో కనిపించడంతో రెండో టెస్టులో అతడికి చోటు దక్కుతుందేమోనని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది. మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది.