హైదరాబాద్: లార్డ్స్ టెస్టులో భారత బౌలర్లు సైతం అద్భుత ప్రదర్శన చేస్తారని టీమిండియా వైస్ కెప్టెన్ రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆతిథ్య ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత బ్యాటింగ్లో తడబడిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఎదురైన ఓటమికి లార్డ్స్లో బదులిస్తారేమో అని అభిమానులు ఆశించినా టీమిండియా ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.
ఈ టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోహ్లీసేన ఇంగ్లీష్ స్వింగ్కు తడబడి 107 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రహానే మీడియాతో మాట్లాడుతూ "పరిస్థితులు మొత్తం ఇంగ్లీష్ బౌలర్లకు అనుకూలించాయి. ముఖ్యంగా అండర్సన్, బ్రాడ్, వోక్స్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్పై పచ్చిక ఉండటంతో బంతి బాగా స్వింగ్ అయింది" అని అన్నాడు.
"దీంతో తొలి అర్ధబాగం బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. పుజారా రనౌట్ విషయంలో అతనిదే తప్పు. అతను రనౌట్ అయినప్పుడు చాలా బాధపడి ఉంటాడు. ఈ వికెట్ టీమిండియా బ్యాటింగ్పై ప్రభావం చూపింది. మన తప్పులను ఎంత త్వరగా గుర్తిస్తే అంత బాగా రాణించగలం. అండర్సన్ సరైన ప్రదేశాల్లో బంతులు వేసాడు" అని పేర్కొన్నాడు.
"అతని నుంచి ఒక్క తప్పిదం కూడా చేయలేదు. ఎవరూ వారికి వారు నిందించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. మానసికంగా సిద్దమై పోరాడాల్సిందే. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తారు. కుల్దీప్ నాలుగు వికెట్లతో చెలరేగుతాడని అనుకుంటున్నా. కెప్టెన్, కోచ్ అతనిపై నమ్మకం ఉంచారు" అని రహానే తెలిపాడు.
"పిచ్ పేస్కు అనుకూలిస్తదన్న మాట వాస్తవమే. కానీ అతనో నాణ్యమైన బౌలర్ అనే విషయం మర్చిపోవద్దు" అని రహానే చెప్పుకొచ్చాడు. తొలి రోజులాగే రెండో రోజు కూడా మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రెండు సెషన్లలో కేవలం 8.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం దోబూచులాడిన రెండో రోజు ఆఖరి ఇన్నింగ్స్ మాత్రమే పూర్తిగా సాగగా ఇంగ్లండ్ పేసర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగారు.
ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్ (5/20) ధాటికి భారత్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్ (29) మాత్రమే టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో బౌలర్ క్రిస్ వోక్స్కు రెండు వికెట్లు దక్కాయి. 2014లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్లో రహానే సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.