

హైదరాబాద్: క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియాలో ద్రవిడ్ పాత్ర పోషించేదెవరంటే.. అజింక్య రహానె పేరే దాదాపుగా వినిపిస్తుంది. యాదృచ్ఛికంగా రహానె శైలీ ద్రవిడ్ను పోలి ఉండేది. అందుకు తగ్గట్టే టాప్ ఆర్డర్ త్వరగా ఔటైనప్పుడు మిడిలార్డర్లో కుదురుగా ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ నమ్ముకోదగ్గ క్రికెటర్గా ఎదిగాడు. అయితే ఏడాది కాలంగా రహానె ఆటలో మార్పు కనిపిస్తోంది. ఫామ్లేమితో బాధపడుతున్నాడు.
టీమిండియా కోచ్గా రవిశాస్త్రి మారిన తర్వాతి నుంచి రహానెను మూడో ఓపెనర్గా భావిస్తున్నామంటూ వన్డేల్లోంచి తప్పించారు. రిజర్వ్ బెంచీకి మాత్రమే పరిమితం చేశారు. వన్డేలు, టీ20ల్లో రోహిత్.. ధావన్ వంటి ఇతర ఆటగాళ్లు విఫలమవుతున్నా వారికి ఇచ్చినన్ని అవకాశాలు రహానెకు ఇవ్వలేదు. ప్రతి క్రికెటర్ ఏదో ఒక దశలో ఫామ్లేమితో బాధపడతాడని తెలిసినా ప్రోత్సహించలేదు.
అంతేకాదు.. జట్టుకు వైస్ కెప్టెన్ అయినా సరే టెస్టుల నుంచి తప్పించి పక్కన కూర్చొబెట్టారు. ఇవన్నీ అతడిని మానసికంగా కుంగదీశాయి. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్లో జరిగే సిరీస్లో ఇంగ్లీషు గడ్డపైనైనా అజింక్యా తన ప్రతిభకు తగ్గ ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగే రెండో టెస్టులో రహానె చెలరేగాల్సిన అవసరం ఉంది. అతడిలో ఉన్న విశేషం ఏమిటంటే విదేశీ సిరీసుల్లో తొలి టెస్టు కన్నా ఎక్కువగా రెండో టెస్టులో పరుగులు చేయడం.
ఇప్పటి వరకూ ద్వైపాక్షిక సిరీసుల్లో 8 తొలి టెస్టులు ఆడిన రహానె 27.07తో 379 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. విచిత్రంగా 7 రెండో టెస్టు మ్యాచుల్లో 92.67తో రహానె 834 పరుగులు సాధించాడు. మూడు అర్ధశతకాలు, ఐదు శతకాలు చేశాడు. కెరీర్లో మొత్తం 46 టెస్టుల ఆడిన అతడు 42.17తో 2,910 పరుగులు సాధించాడు. స్వింగ్, పేస్కు స్వర్గధామమైన విదేశీ పిచ్లపై ఆడటాన్ని సవాల్గా స్వీకరించడం రహానె నైజం. రెండో టెస్టులో అతడు రాణించాలని కోరుకుంటున్నారు.