చెన్నై: చెపాక్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే అర్ధ సెంచరీ సాధించాడు. ఇంగ్లీష్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్న రహానే 104 బంతుల్లో 8ఫోర్ల సాయంతో అర్ధ శతకం పూర్తి చేశాడు. టెస్టు కెరీర్లో రహానేకు ఇది 23వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మొదటి సెషన్లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన జింక్స్.. అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులో తక్కువ పరుగులకే చేసిన రహానే.. రెండో టెస్టులో సత్తాచాటాడు.
మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లకు విశ్వరూపం చూపిస్తున్నాడు. 150 పరుగుల మార్క్ అందుకుని అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ వేసిన 68వ ఓవర్ నాలుగో బంతికి సింగల్ తీసిన రోహిత్.. 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. రోహిత్ టెస్టుల్లో 150కి పైగా పరుగులు చేయడం ఇది నాలుగోసారి. 2019/20లో రాంచీ టెస్టులో (212), 2013/14లో కోల్కతా (177), 2019/20లో వైజాగ్ టెస్టులో (176) పరుగులు చేశాడు.
యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) డకౌట్ అయినా.. టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (21) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. రోహిత్ శర్మ, అజింక్య రహానేలు మాత్రం క్రీజులో పాతుకుపోయి ఇంగ్లీష్ బౌలర్లను పరీక్షిస్తున్నారు. చెత్త బంతులను బౌండరీలు బాదుతూ భారత్ స్కోర్ బోర్డును ముందుకు నాడిపిస్తున్నారు. ఇప్పటికే ఈ జోడి 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 వికెట్లకు 243 పరుగులుగా ఉంది. క్రీజులో రోహిత్ (161), రహానే (61) ఉన్నారు.
128 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అచ్చం వన్డే తరహాలో దాటిగా ఆడిన రోహిత్ శర్మకు టెస్టుల్లో ఇది ఏడో శతకం కాగా.. చెన్నై వేదికగా సెంచరీ నమోదు చేయడం ఇదే తొలిసారి. 2019 నవంబరులో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో రోహిత్ చివరి సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో రోహిత్ నమోదు చేసిన ఏడు సెంచరీలు భారత గడ్డపైనే రావడం విశేషం. రెండో టెస్టుకు ముందు ఆసీస్ పర్యటనలోనూ రోహిత్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆసీస్ గడ్డపై మూడు, నాలుగు టెస్టులు ఆడిన రోహిత్ వరుసగా 26,52, 44,7 పరుగులు సాధించాడు. అనంతరం ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్టులోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లో వరుసగా 6,12 పరుగులు సాధించాడు.
India vs England: హిట్మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ.. 15 నెలల తర్వాత!!