
పూణే: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండవ వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (79 బంతుల్లో 66; 3 ఫోర్లు, సిక్స్), బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ అర్ధ శతకాలు పూర్తి చేశారు. మొదట కోహ్లీ 62 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేయగా.. ఆతరువాత రాహుల్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. మొయిన్ అలీ వేసిన 27వ ఓవర్ చివరి బంతికి సింగల్ తీసిన కోహ్లీ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అనంతరం సిక్స్ బాదిన కోహ్లీ.. 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. రషీద్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ ఔటయ్యాడు.
రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. భారత్ బ్యాటింగ్ చేస్తోంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (4) విఫలమయ్యాడు. నాలుగో ఓవర్ ఐదో బంతికి గబ్బర్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. రీస్ టోప్లీ బౌలింగ్లో స్టోక్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో టీమిండియా 9 పరుగులకే తొలి వికెట్ను కోల్పోయింది.
ఆపై రోహిత్ శర్మ 9వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. సామ్ కరన్ వేసిన 9 ఓవర్ నాలుగో బంతిని రోహిత్ లెగ్ సైడ్ వైపు ఫ్లిక్ చేయబోయి రషీద్కు క్యాచ్ ఇచ్చాడు. స్వింగ్ అవుతూ వచ్చిన ఆ బంతిని రోహిత్ ఫోర్కు పంపిద్దామనుకుని షార్ట్ ఫైన్లెగ్ వైపుగా ఆడాడు. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ ఈజీ క్యాచ్ అందుకోవడంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. రోహిత్ 25 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దాంతో 37 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ను కోల్పోయింది.
ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు త్వరగా ఔట్ అవ్వడంతో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడారు. మొదటిలో ఇద్దరూ నిదానంగా బ్యాటింగ్ చేశారు. క్రీజులో కుదురుకున్నాక కాస్త వేగం పెంచారు. ఎక్కువగా బౌండరీల జోలికి పోకుండా.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకునడిపారు. ఈ క్రమంలోనే మొయిన్ అలీ వేసిన 27వ ఓవర్ చివరి బంతికి సింగల్ తీసిన కోహ్లీ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ఆపై ఇద్దరి మధ్య భాగస్వామ్యం వంద పరుగులు దాటింది.
మరికొద్ది సేపటికే రాహుల్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. మొయిన్ అలీ వేసిన 31వ ఓవర్ మొదటి బంతికి సింగల్ తీసిన రాహుల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో రషీద్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ ఔటయ్యాడు. ఆపై రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. భారత్ 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. క్రీజులో రాహుల్, పంత్ ఉన్నారు.