
పిచ్ పరిస్థితిలో కాస్త మార్పు ఉండొచ్చు:
మూడో టెస్టులో తిప్పేసినట్టుగానే ఆఖరు మ్యాచ్లోనూ ఇంగ్లండ్ను మట్టికరిపించాలని కోహ్లీసేన పట్టుదలగా ఉంది. డేనైట్గా గులాబీ బంతితో జరిగిన మూడో టెస్టు అనూహ్యంగా రెండు రోజుల్లో ముగియడంతో స్పిన్ పిచ్ అంటూ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకు భారత ఆటగాళ్లు దీటుగా బదులిస్తున్నారు. ఇక చివరి టెస్టుకు కూడా గత మ్యాచ్ లాంటి పిచ్ ఉంటుందని భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇప్పటికే పేర్కొన్నాడు. ఈ తరుణంలో ఇంగ్లండ్కు మరో స్పిన్ రైడ్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మూడో టెస్టు గులాబీ బంతితో జరుగగా.. ఈ మ్యాచ్ ఎర్ర బంతితో కావడంతో పరిస్థితిలో కాస్త మార్పు ఉండొచ్చు.

జట్టులోకి ఉమేశ్:
నాలుగో టెస్ట్ కోసం భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో అతడి స్థానంలోకి ఉమేశ్ యాదవ్ను తీసుకునే అవకాశముంది. హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ కూడా పోటీలో ఉన్నప్పటికీ.. అనుభవం రీత్యా ఉమేశ్కే ఛాన్స్ రానుంది. ఇక భారత్ ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగడం ఖాయం. గత మ్యాచ్లో ఎక్కువగా బౌలింగ్ చేయకున్నా.. వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లోనూ కొనసాగనున్నాడు. పిచ్ స్పిన్కే అనుకూలమంటున్న నేపథ్యంలో అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్లపై భారీ అంచనాలున్నాయి. ఈ ఇద్దరు రాణిస్తే ఆంగ్లేయులకు మరోసారి చుక్కలు తప్పవు. మూడో టెస్టులో భారత బ్యాట్స్మన్ కూడా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లండ్ ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లతో బరిలోకి దిగనున్న నేపథ్యంలో కోహ్లీసేన జాగ్రత్తగా ఆడాల్సిందే. గిల్, పుజారా, రహానే భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు.

బెస్ రాక:
వరుసగా రెండు టెస్టుల్లో ఘోర పరాజయాలు చవిచూసిన రూట్ సేన.. సిరీస్ ఓటమి తప్పించుకునేందుకు చివరి టెస్టులో బాగా ఆడేందుకు ప్రయత్నిస్తుంది. అయితే మొతేరా పిచ్ మరీ కఠినంగా ఉండకపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించొచ్చు. జో రూట్ స్పిన్ ఆడటంలో తన నైపుణ్యాన్ని ఈ మ్యాచ్లో చూపిస్తాడని, సహచరులకు దిశా నిర్దేశం చేస్తాడని జట్టు ఆశిస్తోంది. గత మ్యాచ్కు ఒకే స్పిన్నర్ను ఎంచుకుని తప్పు చేసిన రూట్.. ఈ మ్యాచ్లో లీచ్కు తోడుగా బెస్ను ఆడించనుంది. రెండు టెస్టుల్లో కలిపి ఒక్క వికెట్ కూడా తీయని బ్రాడ్ను పక్కన పెట్టే అవకాశం ఉంది. బెయిర్స్టో, స్టోక్స్ నుంచి పెద్ద ఇన్నింగ్స్లు ఆశిస్తున్నాడు రూట్.

పిచ్, వాతావరణం:
మరోసారి స్పిన్కు బాగా అనుకూలించే పిచ్ను ఉపయోగిస్తారని స్పష్టంగా తేలిపోయింది. అయితే ఈసారి డే మ్యాచ్, ఎరుపు బంతి కాబట్టి బ్యాట్స్మెన్ పట్టుదలగా నిలబడితే పరుగులకు అవకాశం ఉంటుంది. వర్షం పడే అవకాశాలు లేవు.

జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్.
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, డొమినిక్ సిబ్లే, జానీ బెయిర్స్టో, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఓలి పోప్, బెన్ ఫోక్స్, డోమ్ బెస్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్/జేమ్స్ అండర్సన్.


Click it and Unblock the Notifications
