
విరాట్ కోహ్లీ
ముంబై టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు రికార్డులు సృష్టించాడు. నాలుగో టెస్టులో కోహ్లీ (235) డబుల్ సెంచరీ సాధించడంతో అత్యధిక వ్యక్తిగత పరగులు సాధించిన భారత టెస్టు కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉంది. 2013లో ఆస్ట్రేలియాపై ధోని సాధించిన 224 పరుగులే ఇప్పటివరకూ టెస్టుల్లో భారత కెప్టెన్గా అత్యధిక స్కోరు. ముంబై టెస్టులో కోహ్లీ ఈ రికార్డుని అధిగమించాడు. అంతేకాదు ఒక కేలండర్ ఇయర్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్గా గుర్తింపు పొందాడు.
ఈ ఏడాది మొదట్లో వెస్టిండిస్తో కరేబియన్ దీవుల్లో జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటీవలే స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇండోర్లో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ 211 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. తాజాగా ముంబైలో ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఒక ఏడాదిలో మూడు సెంచరీలు సాధించిన తొలి కెప్టెన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతంలో ఒక కేలండర్ ఇయర్లో భారత తరపున వినోద్ మన్కడ్, వినోద్ కాంబ్లి, రాహుల్ ద్రవిడ్ రెండు డబుల్ సెంచరీలు సాధించారు.
ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్లో 96వ పరుగు చేసే క్రమంలో కోహ్లీ ఈ సిరిస్లో 500 పరుగుల మార్కుని అందుకున్నాడు. దీంతో మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రికార్డుని సమం చేశాడు. ఒక సిరిస్లో 500కు పైగా పరుగులను గవాస్కర్ రెండు సార్లు సాధించాడు. 1978-79 సీజన్లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో గవాస్కర్ ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు. ఆ తర్వాత 1981-82 సీజన్లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో గవాస్కర్ ఐదు వందల పరుగుల మార్కును రెండోసారి సాధించి చరిత్ర సృష్టించాడు.

మురళీ విజయ్
రెండు, మూడు టెస్టుల్లో విఫలం కావడంతో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అయితే ముంబై టెస్టులో ఆ ఒత్తిడిని జయించి తొలి ఇన్నింగ్స్లో 136 పరుగులతో సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 631 పరుగుల నమోదు చేయడంలో కోహ్లీ, ఛటేశ్వర్ పుజారాలతో కలిసి చక్కని భాగస్వామ్యాలను నమోదు చేశాడు. అంతేకాదు మురళీ విజయ్కి ఇది 8వ టెస్టు సెంచరీ కావడం విశేషం.

జయంత్ యాదవ్
తన కెరీర్లో మూడో టెస్టు ఆడిన ఈ హర్యానా ఆల్ రౌండర్ సెంచరీతో అలరించాడు. ముంబై టెస్టులో 9వ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన జయంత్ యాదవ్ 104 పరుగులు సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో తొమ్మిది వికెట్ గా వచ్చి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 196 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లోనే అరంగేట్రం చేసిన జయంత్ అద్భుతమైన ఆల్ రౌండర్ పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్ కోహ్లితో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని అందించాడు. చివరికి 104 పరుగులు చేసి రషీద్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. విరాట్తో కలిసి ఎనిమిదో వికెట్ కు 240 పరుగులు జోడించి మరో రికార్డు కూడా సృష్టించాడు. ఏ జట్టుపైనైనా టీమిండియా తరఫున ఎనిమిదో వికెట్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.

రవిచంద్రన్ అశ్విన్
ముంబై టెస్టులో అశ్విన్ రికార్డుల మోత మోగించాడు. ఈ టెస్టులో అశ్విన్ 10 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్లో కూడా ఆరు వికెట్లు తీశాడు. దాంతో 10 వికెట్లను అత్యధిక సార్లు తీసిన భారత రెండో బౌలర్గా అశ్విన్ గుర్తింపు పొందాడు. టెస్టు కెరీర్లో అశ్విన్ ఇలా 10 వికెట్లను తీయడం ఏడోసారి. 43 టెస్టుల్లో అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు.
అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో ఎనిమిది సార్లు ఈ ఘనత సాధించాడు. అయితే భారత్ తరుపున అత్యధికంగా 10 వికెట్లను తీసుకున్న బౌలర్గా అశ్విన్ మొదటి స్ధానంలో నిలిచాడు. అనిల్ కుంబ్లే 8 సార్లు 10 వికెట్లను తన ఖాతాలో వేసుకుని మొట్టమొదటి స్ధానంలో నిలిచాడు. కుంబ్లే రికార్డుని అధిగమించడానికి అశ్విన్కు ఎంతో సమయం పట్టకపోవచ్చని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇటీవలే టెస్టుల్లో 200 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్గా కూడా అశ్విన్ నిలిచిన సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ అధిగమించాడు.

రవీంద్ర జడేజా
ముంబై టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వ్యక్తిగత రికార్డుని అందుకున్నాడు. ముంబై టెస్టులో జడేజా 100వ వికెట్ను తీశాడు. తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ 6 వికెట్లు తీసుకోగా, జడేజా 4 వికెట్లు తీసుకుని మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో జడేజా రెండు వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications











