
ఓవల్: పేస్కు సహకరిస్తున్న ఓవల్ పిచ్పై ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో.. భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టు తొలిరోజే ఆసక్తికరంగా మారింది. క్రిస్ వోక్స్, ఓలి రాబిన్సన్ ధాటికి ఒక దశలో కుప్పకూలేలా కనిపించిన టీమిండియాను శార్దూల్ ఠాకూర్ ఆదుకుంటే.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ను మనవాళ్లు దెబ్బకొట్టారు. మొత్తానికి నాలుగో టెస్ట్ తొలి రోజు నుంచే మలుపులు తిరుగుతోంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 191 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.
నాలుగో టెస్ట్ లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతోంది. ఇక్కడ వాతావరణం ప్రస్తుతం మబ్బులు పట్టిఉంది. మొదటి రోజు ఉదయం ఎండకాసినా.. మ్యాచ్ సమయానికల్లా ఆకాశమంతా పూర్తిగా మబ్బులు పట్టింది. కానీ మ్యాచుకు మాత్రం ఎలాంటి అంతరాయం జరగలేదు. పిచ్పై తేమ ఉండడంతో ఇరు జట్ల బౌలర్లు చెలరేగారు. రెండో రోజైన శుక్రవారం కూడా వరణుడు ఆటకు అంతరాయం కలిగించే అవకాశం లేదు. ఎండ కాస్తూనే.. అప్ప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం కానుందట. దీంతో పిచ్ పేస్ బౌలర్లకు సహరించనుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లను నిలువరించేందుకు భారత బౌలర్లకు ఇదే మంచి అవకాశం. పిచ్పై ఉన్న తేమ ఉపయోగించుకుని ఉదయం చెలరేగితే.. మ్యాచుపై భారత్ పట్టుసాధించొచ్చు.
తొలిరోజు భారత్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగగా.. ఆరంభంలో ఓపెనర్లు రోహిత్ శర్మ (11), లోకేష్ రాహుల్ (17) బాగానే ఆడుతున్నట్లనిపించింది. కానీ క్రిస్ వోక్స్ బంతిని అందుకోవడంతో పరిస్థితి మారిపోయింది. అతడు తన మొదటి ఓవర్లోనే రోహిత్ను పెవిలియన్ చేర్చాడు. మరో పరుగైనా రాకుండానే రాహుల్ కూడా వెనుదిరిగాడు. చేతేశ్వర్ పుజారా (4) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. అప్పటికి స్కోరు 39/3. అజింక్య రహానే కంటే ముందు రవీంద్ర జడేజా (10) క్రీజులోకి వచ్చాడు. కానీ అతడు ఎక్కువసేపు నిలబడలేదు. మిగతా బ్యాట్స్మెన్ విఫలమైనా కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు.
23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జో రూట్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన విరాట్ కోహ్లీ కొన్ని చక్కని కవర్డ్రైవ్లు ఆడాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ మంచి ఆరంభాన్ని భారత కెప్టెన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఓలి రాబిన్సన్ బంతిని ఆడబోయిన అతడు.. ఇన్సైడ్ ఎడ్జ్తో జానీ బెయిర్స్టోకు చిక్కాడు. మరోవైపు రహానే పేలవ బ్యాటింగ్ను కొనసాగించాడు. 47 బంతులు ఆడిన అతడు 14 పరుగులే చేసి వెనుదిరిగాడు. టీ సమయానికి భారత్ స్కోరు 122/6. ఆట మొదలయ్యాక మరో పరుగుకే రిషబ్ పంత్ (9) కూడా నిష్క్రమించాడు.
ఇక భారత్ ఇన్నింగ్స్ ముగియడం ఇక లాంఛనమే అనిపించింది. కానీ 150 దాటడం కూడా కష్టమే అనుకున్న జట్టుకు సునామీ ఇన్నింగ్స్తో గౌరవప్రదమైన స్కోరును అందించాడు శార్దూల్ ఠాకూర్. ఫోర్లు, సిక్స్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. శార్దూల్ తన మూడో సిక్స్తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరికి వోక్స్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 190. ఆ తర్వాత మరో పరుగుకే భారత్ మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం బంతితో భారత్ విజృంభించింది. ఆట ముగిసేసరికి రూట్ సేన తొలి ఇన్నింగ్స్ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మలన్ (26 )తో పాటు ఓవర్టన్ (1) క్రీజులో ఉన్నాడు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.