
హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(46) వికెట్ను కోల్పోయింది. పుజారాతో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ను ఆడుతున్న కోహ్లీ.. ఇంగ్లాండ్ యువ బౌలర్ శామ్ కర్రన్ వేసిన ఇన్నింగ్స్ 42వ ఓవర్లో కుక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
ఆఫ్ స్టంప్కి వెలుపలగా వెళ్తున్న బంతిని విరాట్ కోహ్లీ పాయింట్ దిశగా తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతి స్లిప్లోకి వెళ్లగా.. అలిస్టర్ కుక్ కొద్దిగా పక్కకి డైవ్ చేస్తూ క్యాచ్ను అందుకున్నాడు. దీంతో జట్టు 142 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది.
వీరిద్దరి 92 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు పుజారా టెస్టుల్లో 19వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 100 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో పుజారా హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ 43 ఓవర్లకు గాను మూడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో రహానే(3), పుజారా (54) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్కు రెండు వికెట్లు దక్కగా, కర్రన్కు ఒక వికెట్ దక్కింది. నాలుగో టెస్టులో రెండో రోజైన శుక్రవారం 19/0తో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన టీమిండియా తొలి సెషన్లోనే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది.
ఇన్నింగ్స్ 8వ ఓవర్లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ (19) స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (23) బ్రాడ్ బౌలింగ్లోనే కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 50 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి భారత్ ఇబ్బందుల్లో పడింది.
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ
కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆండర్సన్ బౌలింగ్లో ఫోర్ కొట్టిన కోహ్లీ.. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 6,000 పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ (120 ఇన్నింగ్స్ల) రికార్డును సైతం బద్దలు కొట్టాడు.
117 ఇన్నింగ్స్లలోనే 6 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో ముందుండగా, కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. 120 ఇన్నింగ్స్లలో 6 వేల పరుగులు చేసిన టెండూల్కర్ మూడో స్థానానికి దిగజారాడు. ఆ తర్వాతి స్థానాల్లో వీరేంద్ర సెహ్వాగ్ (121), రాహుల్ ద్రవిడ్ (125) ఉన్నారు.
అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 6వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడి రికార్డు ఆస్ట్రేలియా ఆల్టైమ్ గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ పేరున ఉంది. బ్రాడ్మన్ కేవలం 68 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకూ 70 టెస్టు మ్యాచ్లు ఆడిన కోహ్లీ 119 ఇన్నింగ్స్ల్లో 54.61 సగటుతో 6వేల పైచిలుకు పరుగులు చేశాడు.
ఇందులో 23 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2017లో శ్రీలంకతో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో అత్యధికంగా 243 పరుగులు చేశాడు.