
ఆ పరాజయాన్ని మరిపించేలా
ఆరంభం నుంచి పింక్ బంతితో ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపని టీమిండియా.. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవిలోకి వచ్చాక తొలిసారి బంగ్లాదేశ్తో డే/నైట్ టెస్టు ఆడింది. ఫ్లడ్లైట్ల వెలుతురులో భారీ జనసందోహం మధ్య జరిగిన ఆ మ్యాచ్ భారత్ జోరుతో పూర్తి ఏకపక్షంగా ముగిసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ వేదికగా పింక్ బంతి మ్యాచ్లో భారత్.. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరో డే/నైట్ టెస్టుకు సిద్ధమవుతోంది. ఆసీస్ పరాజయాన్ని మరిపించేలా చేయాలని కోహ్లీసేన పట్టుదలతో ఉంది.

ఉమేశ్, బుమ్రాలకు చోటు
బ్యాటింగ్ పరంగా భారత్ టాప్-6తో పటిష్టంగా ఉంది. తన స్థాయి ఏమిటో రోహిత్ శర్మ గత టెస్టులో చూపించగా.. విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. అజింక్య రహానే ఫామ్లోకి రావడం సానుకూలాంశం. చేటేశ్వర్ పుజారా మళ్లీ చెలరేగేందుకు సన్నద్ధమయ్యాడు. ఇక యువ ఆటగాళ్లు గిల్, పంత్ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. చెపాక్ స్పిన్ పిచ్ పైనా పెద్దగా ప్రభావం చూపని కుల్దీప్ యాదవ్పై వేటు తప్పదు. అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. విశ్రాంతి తీసుకున్న బుమ్రా ఈ టెస్టులో ఆడనున్న నేపథ్యంలో అతడి కోసం సిరాజ్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సిందే. ఆడిన తొలి టెస్టులోనే ఆకట్టుకున్న అక్షర్ పటేల్.. అశ్విన్తో స్పిన్ బాధ్యతలు పంచుకునే అవకాశముంది.

బెయిర్స్టో, అండర్సన్, ఆర్చర్ పునరాగమనం
ఇంగ్లండ్ జట్టు కూడా 3-4 మార్పులతో బరిలోకి దిగబోతోంది. జాక్ క్రాలీ ఫిట్నెస్ సాధించడంతో రోరీ బర్న్స్పై వేటు తప్పదు. జానీ బెయిర్స్టో అందుబాటులోకి రావడంతో లారెన్స్ తుది జట్టుకు దూరం కానున్నాడు. గత మ్యాచ్కు విశ్రాంతి తీసుకున్న జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్ పునరాగమనం ఖాయం. స్టువర్ట్ బ్రాడ్కు తుది జట్టులో చోటుండకపోవచ్చు. స్పిన్నర్ లీచ్ మ్యాచ్ ఆడతాడు. రెండో స్పిన్నర్ను ఆడించాలనుకుంటే డొమినిక్ బెస్కు అవకాశం దక్కుతుంది. లేదంటే క్రిస్ వోక్స్ను మూడో స్పెషలిస్టు పేసర్గా ఎంచుకునే అవకాశముంది.

పిచ్ ఎలా ఉందంటే
సాధారణంగా మొతేరా పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. కానీ గులాబి బంతితో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పిచ్పై పచ్చిక ఉంచాల్సిందే. అయితే అది ఏ స్థాయిలో ఉంటుందన్నదే కీలకం. అయితే పిచ్ను ఎలా సిద్ధం చేస్తారో, మ్యాచ్లో అది ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అంతుబట్టని స్థితిలో ఉన్నారంతా. పిచ్ను పూర్తిగా పేసర్లకు అనుకూలంగా మారిస్తే.. మంచి ఫాస్ట్ బౌలింగ్ దళం ఉన్న ఇంగ్లండ్ నుంచి ముప్పు తప్పదు. అందుకే పేస్, స్పిన్కు సహకరించేలా సమతూకంతో ఉండే పిచ్ను సిద్ధం చేసే అవకాశముంది. లక్షా 10 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్నా.. కరోనా కారణంగా సగం మందికే అనుమతి ఉంది. వాతావరణం వేడిగా ఉండనుంది. మ్యాచ్కు వర్ష సూచనలేదు.

తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, గిల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, అక్షర్, ఇషాంత్, ఉమేశ్, బుమ్రా.
ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), సిబ్లే, క్రాలీ, బెయిర్స్టో, స్టోక్స్, పోప్, ఫోక్స్, బెస్/వోక్స్, ఆర్చర్, లీచ్, అండర్సన్.
PinkBall Test: మొతేరా స్టేడియం కెపాసిటీ లక్ష్యా పదివేలు కాదట.. అంతకుముంచి!!


Click it and Unblock the Notifications












