
లండన్: ఆతిథ్య ఇంగ్లాండ్తో కోహ్లీసేన రెండో టెస్ట్కు సన్నద్ధమవుతోంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది. దీంతో ఇరు జట్లు పక్కా గేమ్ ప్లాన్తో బరిలోకి దిగబోతున్నాయి.
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో సంచలన విజయం సాధించిన ఇంగ్లీష్ టీమ్ జోరు మీదుంది. ఈ నేపథ్యంలో లార్డ్స్ టెస్టులో విజయం సాధించి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని కోహ్లీసేన పట్టుదలతో ఉండగా... ఇంగ్లాండ్ మాత్రం ఈ టెస్టులో నెగ్గి సిరీస్పై పట్టుబిగించాలనే యోచనలో ఉంది.
కచ్చితంగా నెగ్గాల్సిన తొలి టెస్టులో టీమిండియా భారత్ బ్యాట్స్మెన్ వైఫల్యంతో ఓటమిపాలైంది. 194 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చేతులెత్తేసింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ మినహా మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ రాణించకపోవడంతో తొలి టెస్ట్లో టీమిండియాకు ఓటమి తప్పలేదు.
తొలి టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ బ్యాట్స్మెన్ మాత్రం విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్లో 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ బ్యాట్స్మెన్ విఫలం కావడం, అదే సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
దీంతో రెండో టెస్టులో అన్ని విభాగాల్లో సత్తా చాటాలని కోహ్లీసేన భావిస్తోంది. రెండో టెస్టు నిమిత్తం కోహ్లీసేన ఇప్పటికే లార్డ్స్కు చేరుకుంది. లార్డ్స్లో ఇంగ్లండ్తో జరగనున్న రెండో టెస్ట్కు ముందు మంగళవారం భారత క్రికెట్ జట్టు నెట్స్లో ప్రాక్టీస్ చేసింది. మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా ఆటగాళ్లందరూ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రాక్టీస్ చేశారు.
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి లార్డ్స్ పిచ్ను పరిశీలించాడు. పిచ్ గురించి క్యూరేటర్ను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి 3 రోజుల్లో తేలిపోయిన ఆతిథ్య జట్టు నాలుగో రోజు బౌలర్లు చెలరేగడంతో విజయం సాధించింది.
బౌలింగ్లో అంచనాలకు మించి రాణించిన ఇంగ్లండ్ బ్యాటింగ్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్లో జో రూట్, జానీ బెయిర్ స్టో బాధ్యతాయుత బ్యాటింగ్ చేయగా... యువ ఆటగాడు శామ్ కర్రన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
దీంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన ఇంగ్లండ్ జట్టు రెండో టెస్ట్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది. లార్డ్స్ టెస్టులో కూడా ఇంగ్లాండ్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా రెండో టెస్టులో ఇంగ్లాండ్ను ఓడించాలంటే అంచనాలకు మించి రాణించాల్సిందే.
ఇదిలా ఉంటే, ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది. మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది.
LIVE: 3.3P PM ONWARDS FROM SONY NETWORKS