లండన్: లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య గురువారం ప్రారంభం కావాల్సిన రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో టాస్ ఆలస్యంగా పడనుంది. వర్షం కారణంగా మైదానం సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. దీంతో ఆటగాళ్లు డ్రస్సింగ్ రూమ్కే పరిమితమయ్యారు.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య గురువారం లార్డ్స్లో రెండో టెస్టు గురువారం ప్రారంభమవుతుంది. కాగా, ఈ సిరిస్లో ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో లార్డ్స్ టెస్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
It's pouring down at the moment and the toss has been delayed due to the same.#ENGvIND pic.twitter.com/ZfkcpJQYPx
— BCCI (@BCCI) August 9, 2018
ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది. 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది. లార్డ్స్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. ఇక్కడ 729/6 పరుగులు చేసింది. ఇక అత్యల్ప స్కోరు భారత్దే.
17 ఓవర్లు ఆడి 42 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అత్యధిక చేజింగ్ స్కోరు 344/1. ఇంగ్లండ్పై విండీస్ సాధించింది. ఇప్పటివరకు టీమిండియా సారథ్య బాధ్యతలు వహించిన ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో విజయాలను సాధించారు.
భారత మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో మాత్రమే భారత్ ఇప్పటి వరకు లార్డ్స్లో విజయాలు నమోదు చేసుకుంది. 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ లార్డ్స్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.ఈ మ్యాచ్లో కపిల్ నాయకత్వంలోని టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆ తర్వాత 2014లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ రెండో సారి లార్డ్స్లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కోహ్లీ వంతు వచ్చింది. దీంతో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో విరాట్కోహ్లీ విజయాన్ని అందుకుంటాడా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.