
లండన్: లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ అరుదైన రికార్డుల్ని సొంతం చేసుకున్నాడు. లార్డ్స్ టెస్టులో జేమ్స్ ఆండర్సన్ చెలరేగడంతో టీమిండియా 107 పరుగులకే కుప్పకూలింది.
తొలి టెస్టులో ఎదురైన ఓటమికి ప్రతిష్టాత్మక లార్డ్స్లో బదులిస్తారేమో అని అభిమానులు ఆశించినా టీమిండియా ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. తొలి రోజులాగే రెండో రోజు కూడా మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రెండు సెషన్లలో కేవలం 8.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
వర్షం దోబూచులాడిన రెండో రోజు ఆఖరి ఇన్నింగ్స్ మాత్రమే పూర్తిగా సాగగా ఇంగ్లండ్ పేసర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగారు. ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్ (5/20) ధాటికి భారత్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది.
వాతావరణంలో తేమ ఉండటం, పిచ్ స్వింగ్కు అనుకూలించడంతో అండర్సన్ తన అద్భుతమైన బౌలింగ్తో చెలరేగాడు. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన అండర్సన్.. భారత్పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఇమ్రాన్ ఖాన్ (94) పేరిట ఉండగా.. 95 వికెట్లతో అండర్సన్ దాన్ని అధిగమించాడు.
మరొకవైపు ఒకే వేదికపై ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలోనూ జేమ్స్ అండర్సన్ ఐదో స్థానంలో నిలిచాడు. కొలంబోలోని సింహాళి స్పోర్ట్స్ గ్రౌండ్లో 166 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీ ధరన్.. క్యాండీలో 117 వికెట్లు పడగొట్టాడు. ఇక గాలేలో 111 వికెట్లు తీశాడు.
ఇక, శ్రీలంకకే చెందిన రంగనా హెరాత్ గాలేలో 99 వికెట్లు తీయగా.. లార్డ్స్లో 23వ టెస్టు ఆడుతున్న అండర్సన్ కూడా ఇప్పటి వరకూ 99 వికెట్లు పడగొట్టి ఐదో స్థానంలో నిలిచాడు. ఇక స్వదేశీ టెస్టుల్లో అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన మూడో బౌలర్గా అండర్సన్ నిలిచాడు.
సొంత గడ్డపై అత్యధిక వికెట్లు (354) తీసిన బౌలర్లలో ఆండర్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే అనిల్ కుంబ్లేను అండర్సన్ అధిగమించాడు. ప్రస్తుతం అండర్సన్ 353 స్వదేశీ వికెట్లతో కొనసాగుతుండగా, ముత్తయ్య మురళీ ధరన్ సొంత దేశంలో జరిగిన టెస్టుల్లో 493 వికెట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.