
చెన్నై: భారత్లో క్రికెట్ మ్యాచ్లు జరిగితే స్టేడియాల్లో సందడి వాతావరణం ఉండేది. అభిమానులతో మైదానాలు కిక్కిరిసిపోయేవి. ఇక టికెట్ల కోసం అయితే రెండు మూడు రోజుల ముందే అభిమానులు స్టేడియాల కౌంటర్ల ముందు బారులు తీరేవారు. టికెట్ కోసం ఎన్నో కష్టాలు పడేవారు. టికెట్ దొరికిన వారు సంతోషంతో.. దొరకని వారు నిరాశతో ఇంటికి వెళ్లేవారు. ప్రస్తుతం ఈ ఘటనలు చెన్నైలోని చెపాక్ మైదానం వద్ద చోటుచేసుకుంటున్నాయి. వాటికి సంబందించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
భారత్లో 2019 నవంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచే చివరిది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు 6 నెలలు ఆటలు నిలిచిపోయాయి. ఆపై ఐపీఎల్ 2020 యూఏఈలో జరగ్గా.. ఆస్ట్రేలియా పర్యటన కంగారూ గడ్డపై జరిగింది. ప్రస్తుతం భారత్లో ఇంగ్లండ్ సిరీస్ జరుగుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడం, ప్రజల్లో అవగాహన రావడంతో కేంద్ర ప్రభుత్వం షరతులతో వీక్షకులకు అనుమతి ఇచ్చింది. దాంతో రెండో టెస్ట్ మ్యాచుకు అభిమానులను అనుమతించారు. అయితే మాస్కులు, భౌతికదూరం మాత్రం తప్పనిసరి. స్టేడియం సామర్థ్యంలో 50% వరకు టికెట్లు ఇస్తున్నారు. రెండో టెస్టు టికెట్ల పంపిణీని గురువారం ఆరంభించారు.
చెపాక్ మైదానంలో ఫిబ్రవరి 13 నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. చిదంబరం స్టేడియం టికెట్ కౌంటర్ల వద్ద భారీ సంఖ్యలో అభిమానులు బారులు తీరారు. చాలా కాలం తర్వాత తమకిష్టమైన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూడొచ్చన్న ఆశతో టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. దొరికిన వారు వాటిని చూసి మురిసిపోతున్నారు. దీంతో స్టేడియం వద్ద సందడి నెలకొంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్గా మారాయి.
ఫస్ట్ టెస్ట్ ఓటమి అనంతరం టీమిండియా తుది జట్టు సెలెక్షన్పై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ను కాదని షాబాజ్ నదీమ్కు చాన్స్ ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు ఎదురయ్యాయి. సీనియర్ రవిచంద్రన్ అశ్విన్తో కలిసి బరిలోకి దిగిన షాబాజ్ నదీమ్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో తేలిపోయారు. అయితే జార్ఖండ్ స్పిన్నర్ను సెకండ్ టెస్ట్కు పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నదీమ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.