విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. ఓపెనర్లు హమిద్(25), అలెస్టర్ కుక్(54)లను ఇంగ్లాండ్ కోల్పోయింది. దాంతో మ్యాచ్ ఫలితం కోసం ఐదో రోజు వరకూ వెళ్లింది. రెండో టెస్టులో భారత్కు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా, ఇంగ్లాండ్ జట్టుని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
అర్ధ సెంచరీ చేసిన కెప్టెన్ కుక్
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్ అర్ధ సెంచరీ సాధించాడు. 172 బంతుల్లో 4 ఫోర్లతో టెస్టుల్లో తన 53వ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. 405 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 58 ఓవర్లకు గాను ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం కుక్ 55, రూట్ 5 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ తొలి వికెట్ను కోల్పోయింది. 50 ఓవర్ల పాటు పరీక్షగా నిలిచిన ఇంగ్లాండ్ ఓపెనర్ల భాగస్వామ్యాన్ని ఎట్టకేలకు అశ్విన్ విడదీశాడు. 51వ ఓవర్ రెండో బంతికి ఇంగ్లండ్ బ్యాట్స్మన్ హసీబ్ హమీద్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 144 బంతులను ఎదుర్కొన్న హసీబ్ హమీద్ 25 వ్యక్తిగత పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. దీంతో 50.2 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ ఒక వికెట్ను కోల్పోయి 75 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 330 పరుగులు వెనకబడి ఉంది.

నిలకడగా ఇంగ్లాండ్
భారత్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు నిదానంగా ఆడుతోంది. 405 పరుగుల విజయలక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆటలో మరో 29 ఓవర్లు మిగిలి ఉండటంతో పాటు చివరి రోజు ఆట ఆడాల్సి ఉంది. మరోవైపు భారత్ బౌలర్లు వికెట్లే లక్ష్యంగా బౌలింగ్ చేస్తున్నారు.
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు 204 పరుగుల వద్ద ఆలౌటైంది. 98/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 106 పరుగులు జోడించి వరుసగా వికెట్లను కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్కు 405 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 455 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 98/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన భారత్ను ఇంగ్లండ్ బౌలర్లు ఏ దశలోనూ కుదురుకోనీయలేదు. అజింక్యా రహానే(26), అశ్విన్(7), సాహా(2)లను స్వల్ప వ్యవధిలో కోల్పోయింది.
109 బంతులను ఎదుర్కొన్న కెప్టెన్ కోహ్లీ 8 ఫోర్లతో 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషిద్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, రషీద్ వెంట వెంటనే వికెట్లు తీసి భారత్ను తేరుకోకుండా చేశారు. అనంతరం జడేజా(14) మోస్తరుగా ఇంగ్లండ్ ను ఎదుర్కొనే యత్నం చేశాడు.

రషిద్ బౌలింగ్లో జడేజా.. బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. చివర్లో జయంత్ యాదవ్(27 నాటౌట్), మొహ్మద్ షమీ(19) పరుగులతో రాణించడంతో భారత్ 200 పరుగులు దాటింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రషిద్ లు తలో నాలుగు వికెట్లు తీసుకోగా, అండర్సన్, మొయిన్ అలీలకు తలో వికెట్ దక్కింది.

ఇక ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 255 పరుగులకే ఆలౌటైంది. విశాఖ టెస్టు బౌలింగ్కు అనకూలిస్తున్న తరుణంలో భారత బౌలర్లు చెలరేగితే గెలుపు లాంఛనమే అవుతుంది.