రెండో టీ20లో టీమిండియా విజయం సాధిస్తే
దీంతో రెండో టీ20లో కూడా విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరిస్ను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో టీమిండియా ఉంది. గతేడాది నవంబర్లో స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా... ఆ తర్వాత జరిగిన అన్ని టీ20 సిరిస్ల్లోనూ విజయం సాధించింది.
రెండో టీ20లో నెగ్గితే వరుసగా ఆరో టీ20 సిరీస్
న్యూజిలాండ్ తర్వాత శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై టీ20 సిరిస్లను కైవసం చేసుకున్న టీమిండియా... శ్రీలంకలో జరిగిన నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరీస్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐర్లాండ్తో ముగిసిన రెండు టీ20ల సిరిస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం ఇంగ్లాండ్తో జరగనున్న రెండో టీ20లో నెగ్గితే భారత్ వరుసగా ఆరో టీ20 సిరీస్ను సాధించినట్లవుతుంది.
కోహ్లీసేన వరుస విజయాలకు ఇంగ్లాండ్ బ్రేక్
మరోవైపు కోహ్లీసేన వరుస విజయాలకు ఇంగ్లాండ్ బ్రేక్ వేయాలని చూస్తోంది. ఇందుకోసం గురువారం సోఫియా గార్డెన్స్లో ఆతిథ్య ఇంగ్లాండ్ తీవ్ర కసరత్తులు చేసింది. అంతేకాదు తొలి టీ20లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. దీంతో కుల్దీప్ బౌలింగ్ను ఎలా ఎదుర్కొనాలనే దానిపై ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దృష్టి సారించారు.
రెండో టీ20లో భారత్ను ఓడిస్తాం: జోస్ బట్లర్
రెండో టీ20లో టీమిండియాను ఓడిస్తామని ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్ బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. రెండో టీ20 నేపథ్యంలో బట్లర్ మాట్లాడుతూ "సిరీస్లో ఒక మ్యాచ్ మాత్రమే ముగిసింది. అది కూడా టీ20 మ్యాచ్. మేము ఇంకా ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాం. కచ్చితంగా రెండో టీ20 మ్యాచ్లో పుంజుకుని భారత్కి గట్టి పోటీనిచ్చి ఓడిస్తాం" అని అన్నాడు.
జట్ల వివరాలు
టీమిండియా:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీష్ పాండే, ధోని(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, హార్ధిక్ పాండ్యా, సిద్దార్ధ్ కౌల్, ఉమేశ్ యాదవ్
ఇంగ్లాండ్:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్ స్టో, జేక్ బాల్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), శామ్ కుర్రన్, అలెక్స్ హేల్స్, క్రిస్ జోర్డాన్, లైమ్ ప్లెంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, దావిద్ మలన్
సోనీ నెట్ వర్క్లో లైవ్ ప్రసారం: రాత్రి 10 గంటలకు