
వరుసగా వికెట్లను కోల్పోవడంతో మాపై ఒత్తిడి
"ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోవడంతో మాపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో పవర్ ప్లే పరుగులు రాకపోవడంతో చివరకు మంచి స్కోరును సాధించలేకపోయాం. ఇంకా 15 పరుగులు చేయాల్సి ఉంది. ఓవరాల్గా చూస్తే బాగానే ఆడాం. ఇంగ్లండ్ కూడా 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా కష్ట పడాల్సి వచ్చింది" అని కోహ్లీ అన్నాడు.

20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్శర్మ (5), ధావన్ (10)తో పాటు తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ (6) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. జేక్ బాల్ బౌలింగ్లో బంతిని పుల్ చేయబోయి రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాత ధావన్ చిత్రంగా రనౌట్ అయ్యాడు.

ప్లంకెట్ బౌలింగ్లో ధావన్ విచిత్రపు రనౌట్
ప్లంకెట్ బౌలింగ్ను బంతిని టచ్ చేసి పరుగు కోసం శిఖర్ ధావన్ ప్రయత్నించాడు. అయితే అవతలి ఎండ్లో క్రీజులోకి వెళ్లే క్రమంలో ధావన్ చేతిలో బ్యాట్ చేజారింది. అదే సమయంలో ధావన్ కాలు గాల్లో ఉండడంతో రనౌట్గా వెనుదిరగాడు. అదే ఓవర్లో రాహుల్ బౌల్డ్ కావడంతో భారత్ 22/3తో కష్టాల్లో పడింది. చివర్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (47), ధోని (32 నాటౌట్) రాణించడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.

5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించిన ఇంగ్లాండ్
అనంతరం 149 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి. దీంతో తొలి రెండు బంతులకు సిక్స్, ఫోర్ బాదిన హేల్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మూడు టీ20ల మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మ్యాచ్ ఇరు జట్ల మధ్య ఆదివారం జరుగనుంది.


Click it and Unblock the Notifications












