
పూణే: రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ దిగి.. 10 వేలకు పైగా పరుగులు చేసిన రెండో క్రికెటర్గా నిలిచాడు. పూణే వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. పాంటింగ్ మూడో నంబర్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగి 12662 పరుగులు చేశాడు.
పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ (66; 79 బంతుల్లో 3×4, 1×6) హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి 10046 పరుగులు పూర్తిచేసుకున్నాడు. రికీ పాంటింగ్ (12662), కోహ్లీ (10046) తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర (9747- 238 ఇన్నింగ్స్), దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ జాక్వస్ కలిస్ (7774) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5421) మాత్రమే ఈ జాబితాలో చోటుదక్కించుకున్నాడు.
రెండో వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. 50 ఓవర్ల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో కెప్టెన్గా కూడా విరాట్ నిలిచాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (5416) ను కోహ్లీ అధిగమించాడు. కెప్టెన్గా కోహ్లీ తన 94వ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. స్మిత్ 150 మ్యాచ్ల్లో 5416 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 234 వన్డేల్లో 8497 పరుగులు చేశాడు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 200 వన్డేల్లో 6641 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు.
పూణేలో జరుగుతున్న రెండవ వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (4), రోహిత్ శర్మ (25) విఫలమైనా.. కేఎల్ రాహుల్ (108; 114 బంతుల్లో 7×4, 2×6) అద్భుతమైన శతకంతో ఆదుకున్నాడు. విరాట్ కోహ్లీ (66; 79 బంతుల్లో 3×4, 1×6) హాఫ్ సెంచరీ చేయగా.. రిషబ్ పంత్ (77; 40 బంతుల్లో 3×4, 7×6), హార్దిక్ పాండ్యా (35; 16 బంతుల్లో 1×4, 4×6) సిక్సర్ల వర్షం కురిపించారు. తొలి వన్డేలో భారత్ 66 రన్స్ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.