
పూణే: ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్.. తన అలవాటులో భాగంగా పొరపాటు చేశాడు. బంతికి లాలాజలం (సెలైవా) రుద్దుతూ మరోసారి దొరికిపోయాడు. ఇంకేముంది ఫీల్డ్ అంపైర్ల ఆగ్రహానికి గురయ్యాడు. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంతిని షైన్ చేసే క్రమంలో బౌలర్లు లాలాజలం ఉపయోగించే అంశంపై నిబంధనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా విషయంలో ఐసీసీ గతేడాది నుంచి కఠిన రూల్స్ అమలుచేస్తోంది.
పూణే వేదికగా ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది. భారత్ బ్యాటింగ్ చేస్తుండగా.. నాలుగో ఓవర్ను పేసర్ రీస్ టాప్లే వేశాడు. రెండో బంతి తర్వాత బెన్ స్టోక్స్ మర్చిపోయి ఆ బంతికి లాలాజలం రుద్దాడు. దీనిని గమనించిన అంపైర్లు నితిన్ మేనన్, వీరేందర్ శర్మ.. ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ జోస్ బట్లర్ను పిలిచి హెచ్చరించారు. ఆపై బంతిని శానిటైజ్ చేసి ఆటను తిరిగి ఆరంభించారు. స్టోక్స్ బంతికి ఉమ్ము రుద్దడం ఇదే తొలిసారి కాదు. ఇదే పర్యటనలో గులాబి టెస్టులో బంతికి లాలాజలం రుద్దుతూ దొరికిపోయాడు.
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో సెలైవాను ఉపయోగించడంను ఐసీసీ నిషేధం. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ అతిక్రమిస్తే .. ఫీల్డ్ అంపైర్ మొదటిసారి హెచ్చరిస్తాడు. శానిటైజ్ చేసిన తర్వాతే బంతిని ఇస్తారు. ఇక రెండోసారి కూడా పునరావృతం చేస్తే.. సదరు ఆటగాడు ప్రాతినిథ్య వహిస్తున్న జట్టుకు ఐదు పరుగుల జరిమానా విధిస్తారు. ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ రూల్ బ్రేక్ చేయలేదు.
పూణేలో జరుగుతున్న రెండవ వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (4), రోహిత్ శర్మ (25) విఫలమైనా.. కేఎల్ రాహుల్ (108; 114 బంతుల్లో 7×4, 2×6) అద్భుతమైన శతకంతో ఆదుకున్నాడు. విరాట్ కోహ్లీ (66; 79 బంతుల్లో 3×4, 1×6) హాఫ్ సెంచరీ చేయగా.. రిషబ్ పంత్ (77; 40 బంతుల్లో 3×4, 7×6), హార్దిక్ పాండ్యా (35; 16 బంతుల్లో 1×4, 4×6) సిక్సర్ల వర్షం కురిపించారు. తొలి వన్డేలో భారత్ 66 రన్స్ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.