
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20లో భారత్కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. 5 ఓవర్లు కూడా ఆడకముందే 20 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోర్ రెండు పరుగుల వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ (1) ఔట్ అయ్యాడు. ఇంగ్లీష్ పేసర్ జోఫ్రా అర్చర్ బౌలింగ్లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. సుదీర్ఘకాలం తర్వాత టీమిండియా తరఫున మ్యాచ్ ఆడుతున్న రాహుల్.. తొలి టీ20లో పూర్తిగా నిరాశపరిచాడు.
ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్లో క్రిస్ జోర్డాన్కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ వరుసగా రెండు డకౌట్లు అవ్వడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ 8 బంతులు ఆడిన విరాట్.. బెన్ స్టోక్స్ బౌలింగ్లో సున్నా పరుగులకే వెనుదిరిగాడు.
ఇక 2021లో ఎక్కువ సార్లు డకౌట్లు అయింది కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం. కోహ్లీ ఇప్పటివరకు మూడు సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. జానీ బెయిర్స్టో, కుశాల్ మెండిస్, అన్రిచ్ నార్జ్ కూడా 2021లో మూడుసార్లు డకౌట్లు అయ్యారు. ఎప్పుడూ కూడా ఫుల్ ఫామ్లో ఉండే విరాట్.. ఇంగ్లండ్తో సిరీసుల్లో పెద్దగా రాణించడం లేదు. ఆసీస్ పర్యటనలో కూడా తన స్థాయి ప్రదర్శన చేయలేదు. కోహ్లీ సెంచరీ చేసి ఎంతో కాలం అవుతోంది.
కోహ్లీ పెవిలియన్ చేరిన అనంతరం సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (4) మార్క్వుడ్ బౌలింగ్లో బోల్డ్ అయ్యాడు. ఆపై శ్రేయాస్ అయ్యర్ అండతో రిషబ్ పంత్ బ్యాట్ జుళిపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా కనిపించిన పంత్.. 10 ఓవర్లో పెవిలియన్ చేరాడు. స్టోక్స్ బౌలింగ్లో డీప్ స్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న జానీ బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో భారమంతా అయ్యర్పైనే పడింది. ప్రస్తుతం భారత్ 12 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 58 రన్స్ చేసింది.