
పూణే: టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా అరంగేట్రం వన్డేలోనే అదరగొట్టాడు. ఇంగ్లండ్తో పూణే వేదికగా మంగళవారం జరుగుతున్న తొలి వన్డేతో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కృనాల్ (58 నాటౌట్: 31 బంతుల్లో 7x4, 2x6) అజేయ అర్ధ శతకంతో చెలరేగాడు. ఇన్నింగ్స్ 41వ ఓవర్లో తన సోదరుడు హార్దిక్ పాండ్యా (1) ఐదో వికెట్ రూపంలో ఔటవగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన కృనాల్ చివరి వరకూ క్రీజులో నిలిచి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. కేఎల్ రాహుల్ (62 నాటౌట్; 43 బంతుల్లో 3×4, 4×6)తో కలిసి ఆరో వికెట్కు అజేయమైన 112 (61 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం అందించాడు.
క్లిష్ట సమయంలో క్రీజ్లోకి వచ్చిన కృనాల్ పాండ్యా ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడు. ఈ క్రమంలో అతను ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 26 బంతుల్లోనే అర్ధ శతకాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో అరంగేట్రంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ప్రపచ క్రికెట్లో ఇన్ని తక్కువ బంతుల్లో ఇప్పటివరకు ఏ అరంగేట్ర ఆటగాడూ అర్థం సెంచరీ చేయలేదు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు జాన్ మోరిస్ (35 బంతుల్లో) పేరిట ఉంది.
తొలి వన్డే మ్యాచ్లోనే అర్ధసెంచరీ నమోదు చేసిన 15వ భారత బ్యాట్స్మెన్గా కృనాల్ పాండ్యా రికార్డు నమోదు చేశాడు. అలాగే 7వ స్థానంలో బ్యాటింగ్కు దిగి హాఫ్ సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. 1997లో దక్షిణాఫ్రికాపై షబా కరీమ్ 55 పరుగులు చేయగా.. 2009లో శ్రీలంకపై రవీంద్ర జడేజా 60 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తాజాగా కృనాల్ పాండ్యా 58 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
అర్థ సెంచరీ పూర్తి చేసిన వెంటనే కృనాల్ పాండ్యా చాలా ఎమోషనల్ అయ్యాడు. గాల్లోకి బ్యాట్ చూపిస్తూ తన తండ్రికి అంకితమిస్తున్నట్లు సైగ చేశాడు. అలాగే ఛాతీపై ఉన్న టీమిండియా సింబల్ను చూపిస్తూ గర్జించాడు. భారత ఇన్నింగ్స్ తర్వాత మీడియాతో మాట్లాడే సమయంలో కూడా కృనాల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'ఈ ఇన్నింగ్స్ నాన్నకు అంకితం' అని చెప్పాడు. ఆ తర్వాత తన తండ్రి గుర్తుకురావడంతో వెక్కివెక్కి ఏడ్చాడు. ఇక మాట్లాడలేకపోయిన కృనాల్.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.