రాణించిన మయాంక్, విహారి
మూడో రోజు భారత్ 192/3 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత ఆటగాళ్లు ఇంగ్లీష్ పిచ్లపై విలువైన సమయం గడిపారు. రెండో ఇన్నింగ్స్లో సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్కు దిగలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (47; 81 బంతుల్లో 7×4), నయా వాల్ చేతేశ్వర్ పుజారా (38; 58 బంతుల్లో 5×4), తెలుగు ఆటగాడు హనుమ విహారి (43 నాటౌట్; 105 బంతుల్లో 3×4), స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (51 రిటైర్డ్హర్ట్; 77 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. జాక్ కార్సన్ రెండు వికెట్లు తీశాడు.
19 ఓవర్లు మిగిలి ఉండగానే
భారత్ ప్రత్యర్థి ముందు 284 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కౌంటీ జట్టు 15.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసిన దశలో ఫలితం తేలదనే ఉద్దేశంతో ఇరు జట్ల కెప్టెన్లు కూడా డ్రాకు అంగీకరించారు. దాంతో రోజు ఆటలో మరో 19 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసింది.
హసీబ్ అహ్మద్ (48 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్), జేక్ లిబీ (48 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్) అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన అహ్మద్ ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్తో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్ల కోసం 17 మందితో కూడిన జట్టును ఇంగ్లండ్ గురువారం ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 311 పరుగులు చేయగా.. కౌంటీ ఎలెవన్ 220 పరుగులు సాధించింది.
భారత్కు మరో ఎదురుదెబ్బ
ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు ముందు పర్యాటక భారత్కు మరో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. వేలి గాయం కారణంగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో రెండో రోజు ఆటలో పేసర్ సిరాజ్ వేసిన బంతి కౌంటీ సెలెక్ట్ లెవెన్కు ఆడుతున్న సుందర్ వేలికి బలంగా తాకడంతో గాయమైంది. ఇప్పటికే శుభ్మన్ గిల్, ఆవేశ్ ఖాన్ గాయాలతో టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఆవేశ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ బదులు కృష్ణప్పను తీసుకునే చాన్సుంది.
28 నుంచి రెండో వామప్ మ్యాచ్
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుని డర్హామ్లోని టీమిండియా క్యాంప్లో అడుగుపెట్టాడు. పంత్ స్థానంలో వికెట్ కీపర్గా మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ శతకంతో ఫామ్ అందుకున్న విషయం తెలిసిందే. జూలై 28 నుంచి రెండో వామప్ మ్యాచ్ జరగనుంది. అందులో విశ్రాంతి తీసుకున్న ప్లేయర్స్ ఆడే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది.