
కోల్కతా: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికగా మారింది. డే-నైట్ టెస్టు మరో చరిత్రాత్మక ఘట్టం. ఈ టెస్టును విజయవంతం చేయడానికి ఏ చిన్న అవకాశాన్ని వదలం అని బంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) సెక్రటరీ అవిషేక్ దాల్మియా పేర్కొన్నారు. భారత క్రికెట్లో ఈడెన్ గార్డెన్స్కు విశేషమైన చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ చరిత్రలో మరో పేజీ పింక్బాల్తో జత కాబోతోంది. నవంబర్ 22 నుంచి 26 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్కతాలో జరిగే రెండో టెస్టును ఫ్లడ్లైట్ల వెలుతురులో పింక్బాల్తో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
ఈ సందర్భంగా క్యాబ్ సెక్రటరీ అవిషేక్ దాల్మియా మాట్లాడుతూ... 'ఒక్క మాటలో చెప్పాలంటే, మేము చాలా సంతోషంగా ఉన్నాం. క్రికెట్ అభిమానులకు ఇది గొప్ప వార్త. ఈడెన్ గార్డెన్స్కు ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మరో పేజీ చేరబోతోంది. డే-నైట్ టెస్టు క్రికెట్ అభివృద్ధికి దోహదపడుతుంది. పింక్ బంతితో మ్యాచ్ను మొదటిగా బంగాల్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించింది. గతంలో స్థానిక మ్యాచ్ను నిర్వహించాం. ఇప్పుడు మరో కొత్త అడుగు వేయనున్నాం' అని అన్నారు.
'సాధించాలనుకునేది మేం సాధించి తీరుతాం. ఈ టెస్టును విజయవంతం చేయడానికి క్యాబ్ ఏ చిన్న అవకాశాన్ని వదలదు. ఈ టెస్ట్ చిరస్మరణీయంగా మారడానికి ఇప్పటి నుండే అంతర్గతంగా ప్రణాళికలను ప్రారంభిస్తాం. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో చర్చించాలి. డే/నైట్ టెస్టుకు ప్రముఖలను ఆహ్వానించాలని భావిస్తున్నాం. ఆ రోజు సందడి వాతావరణం నెలకొంటుంది' అని దాల్మియా తెలిపారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 22న భారత్తో బంగ్లాదేశ్ డే/నైట్ టెస్టు తలపడనున్న విషయం తెలిసిందే. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు అందుకున్న గంగూలీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును డే/నైట్ టెస్టు ఆడాలని విజ్ఞప్తి చేశారు. మొదట బంగ్లా క్రికెటర్లు డే/నైట్ టెస్టును వ్యతిరేకించినా.. బోర్డు వారితో సమావేశమై ఒప్పించింది. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. నవంబర్ 3న ఢిల్లీ వేదికగా బంగ్లాతో భారత్ తొలి టీ20 మ్యాచ్లో తలపడనుంది.