మస్కట్ను ఆవిష్కరించిన దాదా:
తొలి డే/నైట్ టెస్టుకు వేదికవుతున్న కోల్కతా పూర్తిగా గులాబీమయం కానుంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ మ్యాచ్ కోసం పింకూ-టింకూ అనే మస్కట్ను ఆవిష్కరించాడు. మరోవైపు భారీ పింక్ బెలూన్ను కూడా మైదానంలో ఎగిరేశారు. ఇది మ్యాచ్ పూర్తయ్యేదాకా అక్కడే ఉండనుంది. ఇక కోల్కతాలో ల్యాండ్మార్క్గా ఉన్న 157 అడుగుల షహీద్ మినార్తో పాటు పార్కులను పింక్ లైట్లతో అందంగా అలంకరించారు. ప్రజల్లో మరింత ఆసక్తి రేపేందుకు కోల్కతాలో మొత్తం 12 బిల్ బోర్డులను, ఆరు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు.
అసలైన సవాల్ అదే:
ఆదివారం గంగూలీ మాట్లాడుతూ... 'క్రికెట్ పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద దేశం. అయితే ఇక్కడ మైదానాలకు ప్రేక్షకులను రప్పించడమే అసలైన సవాల్. డే/నైట్ టెస్టుకు టికెట్లు మొత్తం అమ్ముడుపోవడం సంతృప్తికరంగా ఉంది' అని తెలిపాడు. అనంతరం ఈడెన్లో మ్యాచ్ టికెట్లను చేతపట్టుకొని, పిల్లలతో కలిసి ఫొటోలు దిగాడు.
మ్యాచ్కు ఇబ్బందేమీ లేదు:
'గతవారం బుల్బుల్ తుఫాన్ కారణంగా బెంగాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మ్యాచ్కు ఇంకా మాకు సమయం ఉంది. ఇబ్బందేమీ లేదు, పిచ్ మంచి స్థితిలోనే ఉంది. పచ్చిక కాస్త ఎక్కువగానే ఉంచాం. మ్యాచ్ అద్భుతంగా సాగుతుందన్న నమ్మకం ఉంది' అని ఈడెన్ గార్డెన్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ పేర్కొన్నాడు.
గంట కొట్టనున్న హసీనా:
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఉదయం గంట కొట్టి డే/నైట్ టెస్టు మ్యాచ్ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత విరామంలో ఫాబ్యూలస్ ఫైవ్ పేరుతో జరిగే టాక్షోలో దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ టెస్టు అనుభవాలను పంచుకోనున్నారు.