
హైదరాబాద్: కామెంటేటర్గా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన డే నైట్ టెస్టు మ్యాచ్ సందర్భంగా మరో కామెంటేటర్ హర్షా భోగ్లేపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
వివరాల్లోకి వెళితే... భారత్లో జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్లో టీమిండియా తొలిసారి పింక్ బాల్తో ఆడిన సంగతి తెలిసిందే. మ్యాచ్ సమయంలో పింక్ బాల్తో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమోనని సంజయ్ మంజ్రేకర్కు ఇరు జట్ల ఆటగాళ్లను అడిగి తెలుసుకోవాలని భోగ్లే సూచించాడు.
డే నైట్ టెస్టులో పింక్ బాల్ ఎలా కనిపిస్తుంది అనే దానిపై క్రికెటర్లను అడిగితేనే సరైన సమాధానం వస్తుందని భోగ్గే పేర్కొన్నాడు. ఈ ప్రశ్నకు సంజయ్ మంజ్రేకర్ తన తోటి కామెంటేటర్ మనసు చివుక్కుమనే మాట అనేశాడు. మంజ్రేకర్ మాట్లాడుతూ "ఈ విషయం నువ్వే అడగాలి. మేము సాధారణ క్రికెట్ ఆడాం. మాకు ఆ అర్హత లేదు" అని అన్నాడు.
"స్లిప్లో ఆటగాళ్లు క్యాచ్లు పడుతున్న తీరును చూస్తే... పింక్ బాల్ అనేది ఒక సమస్య అని నేను అనుకోను. అయితే, బంతి యొక్క ఆకృతే సమస్య" అని అన్నాడు. అయితే, భోగ్లే మరోసారి "ఆటగాళ్లను వారు ఏమనుకుంటున్నారో మనం అడగాలి" అని మంజ్రేకర్కు సూచించాడు.
హర్షా భోగ్లే క్రికెట్ ఆడకుండానే కామెంటేటర్గా ఎదిగిన విషయాన్ని మంజ్రేకర్ పరోక్షంగా ప్రస్తావిస్తూ అతడిని అవమానించాడని నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. మంజ్రేకర్ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ "భోగ్లేతో నువ్వు చాలా దారుణంగా ప్రవర్తించావు. నీ సహచర కామెంటేటర్తో ఎలా మాట్లాడాలో తెలీదు. అతడు కనీసం ఒక మ్యాచ్ కూడా ఆడకపోయినా కామెంటేటర్గా సక్సెస్ అయ్యాడు" అని కామెంట్ చేశాడు.
1987 నుంచి 1996 మధ్య కాలంలో సంజయ్ మంజ్రేకర్ భారత క్రికెట్ జట్టు తరుపున 37 టెస్టులు ఆడిన సంగతి తెలిసిందే. 1992లో విదేశీ పర్యటన కోసం ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆహ్వానించిన తొలి భారతీయ కామెంటేటర్గా హర్షా భోగ్లే అరుదైన ఘనత సాధించాడు.