
బంగ్లాకు కలిసొచ్చేదే:
డే-నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్ణయాన్ని బంగ్లాదేశ్ కోచ్ రస్సెల్ స్వాగతించారు. 'టీమిండియా మంచి టెస్ట్ జట్టు. ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టు. అయితే ఇప్పటివరకు ఒక్క పింక్ బాల్ టెస్ట్ ఆడలేదు. బంగ్లా కూడా ఒక్క డే-నైట్ టెస్ట్ ఆడలేదు. దీంతో రెండు జట్ల ఆటగాళ్ళలో కొంత అనిశ్చితి ఉంటుంది. ఇరు జట్లకూ పింక్ బాల్ టెస్ట్లు ఆడిన అనుభవం లేదు కాబట్టి ఆతిథ్య భారత్పై బంగ్లాకు ఇది కలిసొచ్చే అంశం' అని రస్సెల్ పేర్కొన్నారు.

ఇరు జట్లకూ కొత్త అనుభవం:
'కోచ్గా నాకు ఇదో మంచి అవకాశం. ఇరు జట్లకూ ఇదో కొత్త అనుభవం. ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం. డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం లేదు. అయినా పింక్ బాల్ టెస్ట్ను చాలెంజ్గా తీసుకుంటాం. ఖచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయి. అందుకు సిద్ధంగా ఉన్నాం. నాకున్న అనుభవాన్ని ఆటగాళ్లతో పంచుకుంటా. తొలి టెస్ట్ ముగిసిన తర్వాతనే డే/నైట్ మ్యాచ్ గురించి ఆలోచిస్తాం. అంతకన్నా ముందు టీ20 సిరీస్పై దృష్టి పెట్టాలి' అని రస్సెల్ అన్నారు.

దాదా ముందడు:
అంతర్జాతీయ క్రికెట్లో నాలుగేండ్ల క్రితమే తొలి డే అండ్ నైట్ టెస్టు జరిగినా.. భారత్ మాత్రం ఫ్లడ్ లైట్ల కింద ఆడేందుకు ఏవేవో సాకులు చెపుతూ వచ్చింది. ఆసీస్ పర్యటనకు వస్తున్న అన్ని జట్లు ఒక్క మ్యాచ్నైనా గులాబీ బంతితో ఆడుతున్నాయని పట్టుబట్టింది. అయినా బీసీసీఐ మాత్రం సీఏ ప్రతిపాదనను తిరస్కరించింది. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పీఠం అధిరోహించాక కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఈ అంశంపై చర్చించాడు. దీనికి విరాట్ ఓకే అనడంతో దాదా ముందడుగేసాడు.

పావులు కదిపిన దాదా:
గంగూలీ స్వయంగా బంగ్లా క్రికెట్ బోర్డుకు లేఖ రాయడంతో పాటు వారితో డే నైట్ టెస్టుకు ఓకే అనిపించాడు. దీంతో టీమిండియా తొలి డే నైట్ టెస్ట్ ఆడేందుకు సిద్దమయింది. సంప్రదాయ క్రికెట్కు పూర్వ వైభవం తీసుకురావడంలో దాదా తన పాత్ర పోషించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు జరిగిన రాంచీ స్టేడియం ప్రేక్షకులు లేక వెలవెలబోయిన విషయాన్ని గమనించిన దాదా.. ఇకపై ఇలాంటి పరిస్థితులు ఎదురుకావొద్దనే ఉద్దేశంతో తెలివిగా పావులు కదిపాడు.


Click it and Unblock the Notifications
