బౌలర్లే మ్యాచ్ గెలిపించారు
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...'బౌలర్లే మ్యాచ్ గెలిపించారు. మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆట మధ్యలో ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. ఒక దశలో బంగ్లాకు 8 ఓవర్లలో 70 పరుగులు అవసరమైనపుడు మాకు విజయం కష్టంగా మారింది. అయితే మా ఆటగాళ్లు బాధ్యత తీసుకొని మ్యాచును మా వైపుకు తెచ్చారు. భారత జెర్సీపై ఉన్న బ్యాడ్జ్ కోసమే మనం ఆడుతున్నామనే విషయాన్ని అందరికి గుర్తు చేశా. ఈ విజయం క్రెడిటంతా బౌలర్లకే. ముఖ్యంగా చాహర్ సూపర్' అని రోహిత్ అన్నాడు.
ప్రతిఒక్కరి నుంచి ఇదే ఆశిస్తున్నాం
'కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ బాగా బ్యాటింగ్ చేసారు. కీలక సమయంలో బాధ్యత తీసుకుని మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆరంభంలో రాహుల్ బాగా ఆడితే, స్కోరును పెంచడంలో అయ్యర్ సక్సెస్ అయ్యాడు. ఇలా ప్రతీ ఒక్కరూ రాణించడం శుభ సూచికం. ప్రతిఒక్కరి నుంచి ఇదే ఆశిస్తున్నాం. ఆటగాళ్లు అందరూ బాధ్యత తీసుకున్నారు' అని రోహిత్ పేర్కొన్నాడు.
సెలక్టర్లకు, కోహ్లీకి తలనొప్పే
'టీ20 సిరీస్కు కొందరు ఆటగాళ్లు దూరమైనా.. తిరిగి జట్టులోకి వస్తారు. టీ20 ప్రపంచకప్ సమయానికి ఇంకా మ్యాచులు ఉన్నాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా ఫ్లయిట్ ఎక్కేలోపు అత్యుత్తమ జట్టును కనుక్కోవాలి. ఈరోజు ఆడినట్టే మేం మంచి ప్రదర్శన కొనసాగిస్తే.. సెలక్టర్లకు, విరాట్ కోహ్లీకి ఎంపిక ప్రక్రియ పెద్ద తలనొప్పిగా మారుతుంది' అని రోహిత్ నవ్వుతూ అన్నాడు.
నాల్గో స్థానంపై అయ్యర్ కన్ను
ఈ సిరీస్లో యువ క్రికెటర్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రధానంగా శివమ్ దూబే, దీపక్ చహర్లు రాణించి సిరీస్ను చేజిక్కించుకోవడంలో ముఖ్య భూమిక పోషించాడు. శ్రేయస్ అయ్యర్ కూడా సత్తా చాటి.. భారత జట్టు ఎప్పుట్నుంచో అన్వేషిస్తున్న నాల్గో స్థానంపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న కీపర్ రిషభ్ పంత్ మాత్రం నిరాశ పరుస్తూనే ఉన్నాడు.
సిరీస్ కైవసం
మొదటగా శ్రేయస్ అయ్యర్ (62; 33 బంతుల్లో 3x4, 5x6), కేఎల్ రాహుల్ (52; 35 బంతుల్లో 7x4) మెరవడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. దీపక్ చాహర్, శివమ్ దూబె అద్భుతంగా బౌలింగ్ చేశారు. టీమిండియా 30 పరుగులతో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.