
ఇండోర్: భారత ఆటగాళ్లు సమిష్టి ప్రదర్శన చేయడంతో తొలి టెస్టులో బంగ్లాపై భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా రెండో టెస్టు నవంబర్ 22న ప్రారంభం కానుంది. తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో.. డే/నైట్ టెస్టుకు ముందు రెండు రోజుల అదనపు సమయం లభించడంతో టీమిండియా పింక్ ప్రాక్టీస్ చేసింది.
రోహిత్ శర్మ, చెతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ తొలిసారి ఫ్లడ్లైట్ల వెలుతురులో గులాబి బంతితో ప్రాక్టీస్ చేశారు. శనివారం బంగ్లాతో మ్యాచ్ ముగిశాక హోల్కర్ స్టేడియంలో కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో శిక్షణ సాగింది. కోల్కతా డే/నైట్ టెస్టు మ్యాచ్ కోసం గులాబికి అలవాటు పడేందుకు హోల్కర్ మైదానంలో రాత్రుళ్లు సాధన చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా గులాబి బంతితో సాధన చేశాడు. రిజర్వు బ్యాట్స్మెన్ హనుమ విహారి, శుభ్మన్ గిల్ సైతం సాధన చేయడం గమనార్హం.
రోహిత్ శర్మ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను రాత్రిపూట ఎదుర్కొన్నాడు. కోచ్ రవిశాస్త్రి బంతి ప్రవర్తనను దగ్గరుండి పరిశీలించారు. కూకాబుర్ర గులాబి బంతులతో దులీప్ ట్రోఫీలో ఆడిన అనుభవం కుల్దీప్కు ఉంది. అతడు బంతిని ఫ్లైట్ చేసినప్పుడు సీమ్ను అందుకోవడంలో బ్యాట్స్మన్ ఇబ్బంది పడ్డారు.
తొలి డే/నైట్ టెస్టుకు ముందు రెండు రోజుల అదనపు సమయంను భారత్తో పాటు బంగ్లాదేశ్ కూడా సద్వినియోగం చేసుకునేందుకు ఇండోర్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఆదివారం కూడా ఇరు జట్లు ఇక్కడ గులాబీ బంతితో ప్రాక్టీస్ చేయనున్నాయి. ఇరు జట్లలో చాలా మంది సభ్యులకు పింక్ బంతి కదలికలపై పెద్దగా అవగాహన లేదు. అందుకే ఈ రెండు రోజులు ఇక్కడే ఉండి ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు. భారత్, బంగ్లాదేశ్ జట్లు మంగళవారం కోల్కతాకు చేరుకుంటాయి.