స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ను 280 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. అదే జోరులో రెండో టెస్టులోనూ నెగ్గి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. కాన్ఫూర్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి టెస్టు ఫ్రారంభం కానుంది.
అయితే ఈ టెస్టు సజావుగా కొనసాగడం అనుమానమే. రెండు విషయాలు భారీ అడ్డంకులుగా మారే అవకాశం ఉంది. వరుణుడు ఆటకు ఆటంకం కలిగించేలా ఉన్నాడు. టెస్టు మొదటి రెండు రోజులు భారీ వర్షపు సూచన ఉంది. వాతావరణ శాఖ ప్రకారం... శుక్రవారం 92 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే శనివారం 80 శాతం వర్షం పడే ఛాన్స్ ఉంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్.. ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ను అదనపు కవర్లను కోరింది. మైదానాన్ని పూర్తిగా కప్పి ఉంచడానికి సిద్ధమైంది. అయితే మైదానానికి మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉందని, పూర్తి మ్యాచ్ కొనసాగేలా ప్రయత్నిస్తామని స్థానిక క్రీడా అధికారి పేర్కొన్నారు. ఇక మ్యాచ్ అడ్డంకి మరో కారణం.. నిరసన సెగ.
హిందూ మహా సభ నిరసన సెగతో మైదానం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే కారణంతో ఈ సిరీస్ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. హిందూమహా సభ ఉపాధ్యక్షుడు జయవీర్ భరద్వాజ్ నిరసనలు గురించి మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో హిందువులపై, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా గ్వాలియర్లో నిరసనలు చేపడతామని చెప్పారు.
గ్వాలియర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. అయితే కాన్పూర్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. హోటల్ నుంచి మైదానం వరకు, ఇరు జట్ల ఆటగాళ్లకు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామని కాన్పూర్ పోలీస్ కమీషనర్ హరీష్ చందర్ చెప్పారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్క భద్రత బాధ్యతలు చూస్తాయని తెలిపారు. నిరసనలు తెలిపేందుకు ప్రయత్నిస్తే చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, రెండో టెస్టు కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లు కాన్పూర్ చేరుకున్నాయి.