హైదరాబాద్: ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో టాప్ ర్యాంకు కోసం భారత స్టార్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల మధ్య గట్టి పోటీ ఎదురవనుంది. ఐసీసీ తాజా ర్యాంకుల్లో అశ్విన్ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతుండగా, జడేజా రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు.
ఈ ఇద్దరి మధ్య దూరం కేవలం 8 పాయింట్లే. దీంతో బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 9 నుంచి జరిగే ఏకైక టెస్టులో రాణించి అగ్రస్థానాన్ని సాధించాలని జడేజా, దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని అశ్విన్ ప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి అశ్విన్ టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్తో జరిగే ఏకైక టెస్టులో ఆడుతున్న ఇషాంత శర్మ 23వ స్థానంలో, ఉమేష్ యాదవ్ 37వ ర్యాంక్లో ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా తమ ర్యాంకులను మెరుగుపరచుకోవాలని చూస్తున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ర్యాంక్లో ఉండగా, స్టీవ్ స్మిత్ టాప్లో కొనసాగుతున్నాడు.
అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్కు కోహ్లీకి మధ్య 58 పాయింట్ల తేడా ఉంది. దీంతో హైదరాబాద్ టెస్టులో కోహ్లీ సత్తా చాటాలని భావిస్తున్నాడు. పుజారా (12), రహానే (15), విజయ్ (27)లు కూడా ర్యాంక్ మెరుగుపై దృష్టిపెట్టారు.
జట్టు ర్యాంకుల్లో భారత్ (120) అగ్రస్థానంలో ఉండగా, బంగ్లా (58) తొమ్మిదో ర్యాంక్లో ఉంది. హైదరాబాద్ టెస్టులో నెగ్గితే బంగ్లాకు 5 పాయింట్లు వస్తాయి. భారత 120 నుంచి 118 పాయింట్లకు పడిపోనుంది. భారత నెగ్గితే ఒకే పాయింట్ లభిస్తుంది.