
ఢాకా: బంగ్లాదేశ్ సీనియర్ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ ముష్ఫికర్ రహీమ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పనిభారం ఎక్కువవడంతో టెస్ట్ ఫార్మాట్లో వికెట్ కీపింగ్ను వదిలేస్తున్నట్లు ముష్ఫికర్ వెల్లడించాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్లో బ్యాట్స్మన్గా మాత్రం కొనసాగుతా అని స్పష్టం చేసాడు. ఇదే విషయాన్ని ముష్ఫికర్ బంగ్లా ప్రధాన కోచ్ రసెల్కు వెల్లించాడు. కోచ్ రసెల్ జట్టు యాజమాన్యానికి తెలియజేయగా.. రహీమ్ నిర్ణయాన్ని అంగీకరించినట్లు సమాచారం తెలుస్తోంది.
తాజాగా ముష్ఫికర్ రహీమ్ మాట్లాడుతూ... 'ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాను. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఢాకా ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లలో కూడా పాల్గొంటున్నాను. దీంతో పనిభారం ఎక్కువ అవుతోంది. సుదీర్ఘ ఫార్మాట్లో వికెట్ కీపింగ్ చేయాలని లేదు. మరికొంత కాలం క్రికెట్ను ఆడాలనే ఉద్దేశంతో.. టెస్ట్ ఫార్మాట్లో వికెట్ కీపింగ్ను వదిలేస్తున్నా' అని అన్నాడు.
'గత ఏదేళ్లుగా నాకు ఎటువంటి తీవ్రమైన గాయం అవ్వలేదు. విశ్రాంతి కూడా లభించలేదు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకూడదు. భవిష్యత్తులో ఒకటి లేదా రెండు సిరీస్లలో విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితులు తలెత్తకూదు అంటే పనిభారాన్ని తగ్గించాలి. పనిభారాన్ని తగ్గించాలంటే టెస్ట్లో కీపింగ్ చేయకపోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా' అని ముష్ఫికర్ రహీమ్ తెలిపాడు.
'కీపింగ్ వదిలేయడంతో బాగా పరుగులు చేస్తానని కాదు. కీపింగ్ చేస్తూనే రెండు డబుల్ సెంచరీలు సాధించాను. కీపింగ్ చేస్తేనే.. బ్యాటింగ్లో ఎక్కువగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే వికెట్ల వెనకాల ఉండి ప్రతిదీ పరిశీలించవచ్చు. కానీ.. ఇప్పటికే 32 ఏళ్లు ఉన్నాను. ఫిట్నెస్ కాపాడుకోవాలి. అన్నీ ఆలోచించా' అని ముష్ఫికర్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ తరఫున ముష్ఫికర్ 67 టెస్టులు, 216 వన్డేలు, 81 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 4,029, వన్డేల్లో 6,100, టీ20ల్లో 1,201 పరుగులు చేశాడు.