కోల్కతా: ఈడెన్ వేదికగా తొలిసారి భారత్-బంగ్లా జట్లు డే/నైట్ టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈడెన్లో రెండో రోజు ఆటకు ముందు భారత చదరంగ రారాజు, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ప్రస్తుత ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ఈడెన్లో గంట మోగించారు. తమకు ఈ అవకాశం కల్పించిన బీసీసీఐకి, అధ్యక్షుడు గంగూలీకి వారు ధన్యవాదాలు తెలియజేశారు.
ఆనంద్, కార్ల్సన్ గంటను మోగించిన చిత్రాన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తొలి రోజు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ్ బంగ సీఎం మమతా బెనర్జీ గంట మోగించిన విషయం తెలిసిందే. తొలి డే/నైట్ టెస్టుసందర్భంగా క్రికెట్తో పాటు ఇతర క్రీడా ఆటగాళ్లను కూడా బీసీసీఐ సన్మానం చేస్తోంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టెన్నిక్ క్రీడాకారిణి సానియా మీర్జా, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ను శుక్రవారం సాయంత్రం బెంగాల్ క్రికెట్ సంఘం సత్కరించింది.
Five-time world champion @vishy64theking and current champion Magnus Carlsen rang the bell on Day 2 at the Eden Gardens. @Paytm #PinkballTest #INDvBAN #TeamIndia pic.twitter.com/Szy3f1PAe3
— BCCI (@BCCI) 23 November 2019
చారిత్రక డే/నైట్ టెస్టు సందర్భంగా టీమిండియా మాజీ సారథులు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజహరుద్దీన్, కృష్ణమాచారి శ్రీకాంత్, జులన్ గోస్వామి, మిథాలీరాజ్ తదితరులను ప్రత్యేక బండ్లలో మైదానంలో ఊరేగించారు. ఇక మూడో రోజు గాయనీ గాయకులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని సమాచారం.
'ఇప్పుడు భారత్లో డే/నైట్ టెస్ట్ ఆడేందుకు అంగీకరించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కెప్టెన్ విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం ఆసీస్ టూర్లో అడిలైడ్లోనూ టీమిండియా మరో డే/నైట్ టెస్ట్ ఆడుతుందని ఆశిస్తున్నా' అని వార్న్ ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా సౌరవ్ను అభినందించాడు. 'వెల్డన్ సౌరవ్. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా లోనూ ఒకటి రెండు గులాబీ మ్యాచ్లు జరుగుతాయని భావిస్తున్నా' అని వాన్ ట్వీట్ చేశాడు.