
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ 159 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 101 పరుగులతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ సెంచరీ కాగా మొత్తంగా 70వ సెంచరీ.
వన్డేల్లో ఇప్పటికే విరాట్ కోహ్లీ 43 సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుపు, ఎర్ర బంతులతో జరిగిన మ్యాచ్ల్లో సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ తాజాగా పింక్ బాల్ టెస్టులో సైతం సెంచరీ సాధించాడు. ఫలితంగా భారత్లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.