
హైదరాబాద్: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. మూడో రోజైన శనివారం లంచ్ విరామానికి బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఇంకా 283 పరుగుల వెనుకంజలో ఉంది. దాంతో భారత్ మూడో రోజే మ్యాచ్ను గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి.
టీమిండియా విజయానికి 6 వికెట్లు దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో ముష్ఫికర్ రహీమ్(6), మహ్మదుల్లా(6) పరుగులతో క్రీజులో ఉన్నారు. శనివారం టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ను ఓవర్నైట్ స్కోరు 493/6వద్దే డిక్లేర్డ్ చేయడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ను ఆరంభించింది. రెండో ఇన్నింగ్స్లో కూడా భారత పేసర్లు చెలరేగుతున్నారు.
మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగ్లాదేశ్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఆరో ఓవర్లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఇమ్రుల్ కెయెస్(6) బౌల్డయ్యాడు. ఆ తర్వాత ఇషాంత్ బౌలింగ్లో మరో ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్(6)ని బౌల్డ్ కావడంతో బంగ్లాదేశ్ 18 పరుగులకి రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ తర్వాత మహ్మద్ షమీ బౌలింగ్లో మొమినుల్ హక్(7), మిథున్(18)లు పెవిలియన్కు చేరారు. రెండో ఇన్నింగ్స్లో భారత పేసర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. బంగ్లాదేశ్ కోల్పోయిన నాలుగు వికెట్లలో ఉమేశ్, ఇషాంత్లు చెరో రెండు వికెట్లు తీయగా... మహ్మద్ షమీకి రెండు వికెట్లు లభించాయి.
ఇండోర్ వేదికగా గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే కుప్పకూలింది. భారత్ రెండో రోజు 493/6 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్లో 343 పరుగుల ఆధిక్యం లభించింది. మయాంక్ అగర్వాల్ (243), రహానే (86), రవీంద్ర జడేజా (60 నాటౌట్) రాణించిన సంగతి తెలిసిందే.