
హైదరాబాద్: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 14 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (6; 14 బంతుల్లో ఫోర్) అబు జయేద్ బౌలింగ్లో వికెట్ కీపర్ లిటన్ దాస్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
రోహిత్ శర్మ ఔట్ కావడంతో హోల్కర్ స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కాగా, ఇటీవలే సఫారీలతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో రోహిత్ శర్మ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్తో ప్రస్తుతం జరుగుతున్న సిరిస్లో రోహిత్ నుంచి అభిమానులు అదే ఆశించారు.
అయితే, రోహిత్ శర్మ(6) పరుగులకే పెవిలియన్కు చేరడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత పుజారా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 15 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్(15), పుజారా(26) పరుగులతో ఉన్నారు.
టీమిండియా ఇంకా 103 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. గురువారం తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్పై ఆద్యంతం టీమిండియాదే పైచేయిగా నిలిచింది.
బంగ్లాదేశ్ జట్టులో ముష్ఫీకర్ రహీమ్(43; 105 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్)తో టాప్ స్కోరర్గా నిలవగా, కెప్టెన్ మోమినుల్ హక్(37; 80 బంతుల్లో 6 ఫోర్లు) ఫరవాలేదనిపించాడు. మిగతా బ్యాట్స్మెన్ టీమిండియా పేసర్ల నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కొనలేక చేతులెత్తేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా... రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, ఇశాంత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.