
హైదరాబాద్: భారత్లో తొలి డే నైట్ టెస్టు ప్రారంభమైంది. కోల్కతాలోనీ ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న డే నైట్ టెస్టు 12వది కావడం విశేషం.
ఈ డే నైట్ టెస్టుని క్యాబ్ అంగరంగవైభవంగా నిర్వహిస్తోంది. తొలిసారి భారత్లో డే నైట్ టెస్టు మ్యాచ్ జరుగుతుండటంతో కోల్కతా మొత్తం పింక్ మయం అయింది. ఇప్పటికే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం, హుగ్లీ నదిపై వంతెన, క్లాక్ టవర్, తదితర చారిత్రక ప్రదేశాలు గులాబీమయం అయ్యాయి.
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్కు ముఖ్య అతిథులుగా బంగ్లా ప్రధాని షేక్ హసీన, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. రెండు దేశాల జాతీయ గీతాలాపన ముగిశాక వీరిద్దరూ సంయుక్తంగా గంట మోగించి మ్యాచ్ని అధికారికంగా ప్రారంభించారు.
అంతకముందు ఈ పింక్ బాల్ టెస్టు కోసం బంగ్లా ప్రధాని షేక్ హసీనా కొద్ది సేపటి క్రితం కోల్కతా సుభాష్ చంద్ర బోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆమెకు ఘన స్వాగతం పలికారు. టాస్ కోసం ప్రత్యేకంగా బంగారు నాణెం తయారు చేయించడం గమనార్హం.
మ్యాచ్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇరు జట్ల ఆటగాళ్లను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పరిచయం చేశాడు. ఆ తర్వాత పేరుపేరునా జట్టు సభ్యులు, కోచ్, సహాయ కోచ్లను కోహ్లీ ఆమెకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా, మమతా బెనర్జీ ఆటగాళ్లతో ముచ్చటించారు.
భారత్లో తొలిసారి జరుగుతున్న డే నైట్ టెస్టు కోసం పింక్ బాల్ను ఉపయోగిస్తున్నారు. ఈ పింక్ బాల్ను తయారు చేయడానికి 8 రోజులు పడుతుంది. పింక్ బాల్ ఇన్నర్ కోర్ను కోర్క్, రబ్బర్తో తయారు చేస్తారు. పింక్ బాల్ చుట్టుకొలత 22.5 సెంటీమీటర్లు. భారత్లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ కావడంతో ఈడెన్ గార్డెన్ దాదాపు నిండిపోయింది.
ఇప్పటికే ఈ టెస్టుకి సంబంధించిన నాలుగు రోజులు టికెట్లు అమ్ముడయ్యాయి. పింక్ టెస్ట్ సందర్భంగా కోల్కతాలోని కొన్ని దుకాణాల్లో మిఠాయిలను పింక్ కలర్తో తయారు చేయడం విశేషం. కోల్కతాలో స్వీట్లు పింక్గా మారిపోయాయని క్యాప్షన్ తగిలిస్తూ గంగూలీ ఈ ట్వీట్ చేశాడు.
ఇది ఈ ప్రాంతంలో చేసే స్వీట్ అని పేర్కొన్న గంగూలీ.. అచ్చం గులాబీ బంతుల తరహాలో ఉన్న మరికొన్ని స్వీట్లను కూడా ట్వీట్ చేశాడు. పింక్ టెస్టు రోజు కోల్కతా మొత్తం పింక్గా మారిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తూ ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను గంగూలీ ట్విటర్లో పంచుకున్నారు.