టీ20 వరల్డ్ కప్లో భారత్ వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. లీగ్ దశలోనూ, సూపర్-8 స్టేజ్లోనూ సత్తాచాటుతూ సెమీఫైనల్స్ బెర్తు ముంగిట నిలిచింది. ఆంటిగ్వా వేదికగా శనివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 196 పరుగులు చేసింది.
హార్దిక్ పాండ్య (50 నాటౌట్; 27 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (37; 28 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు), రిషభ్ పంత్ (36; 24 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శివమ్ దూబె (34; 24 బంతుల్లో, 3 సిక్సర్లు) సత్తాచాటారు. బంగ్లా బౌలర్లలో తన్జీమ్ హసన్ సకిబ్ (2/32), రిషద్ హొస్సేస్ (2/43) చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (40; 32 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. కుల్దీప్ యాదవ్ (3/19) మూడు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా (2/13), అర్షదీప్ సింగ్ (2/30) రెండు వికెట్లతో సత్తాచాటారు. అయితే ఈ క్రమంలో టీమిండియా అరుదైన రికార్డులు బ్రేక్ చేసింది.
టీ20 వరల్డ్ కప్లో ఓ ఇన్నింగ్స్లో భారత్ సాధించిన అత్యధిక సిక్సర్ల రికార్డు ఈ మ్యాచ్లోనే నమోదైంది. బంగ్లాపై మన బ్యాటర్లు 13 సిక్సర్లు బాదారు. అంతకుముందు 2007 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై సాధించిన 11 సిక్సర్లు అత్యధికంగా ఉండేవి. ఇక టీ20 చరిత్రలో టాప్-5 బ్యాటర్లలో ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ చేయకుండా చేసిన రెండో అత్యధిక స్కోరు ఇదే (196). 2019లో న్యూజిలాండ్పై 208 పరుగులు సాధించిన స్కోరు అత్యుత్తమం. బంగ్లా మ్యాచ్లో హార్దిక్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు.
కాగా, టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్పై భారత్కు ఇది వరుసగా అయిదో విజయం. ఆడిన అయిదింట్లోనూ మనదే పైచేయి. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్లో ఓ జట్టుపై వరుసగా అత్యధిక విజయాలు సాధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాపై ఆసీస్, పాక్ వరుసగా ఆరు విజయాలు సాధించాయి.