బెంగుళూరు: ఐసీసీ వరల్డ్ టీ20 వరల్డ్ కప్లో సెమీస్ ఆశలను సజీవంగా టీమిండియా ఉంచుకోవడానికి చాలానే కష్టపడింది. ఆఖరు బంతి వరకూ నువ్వానేనా అన్నట్టు సాగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన పోరాట పటిమను కనబర్చింది.
ఆఖరి ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 11 పరుగులు కావాల్సి వచ్చింది. నెహ్రా, బుమ్రా, అశ్విన్, జడేజా ఓవర్లు పూర్తయయ్యాయి. దీంతో ఇక హార్దిక్ పాండ్యానే బౌలింగ్ వేయాల్సి ఉంది. ధోని కూడా అతడినే నమ్మాడు. ఆరు బంతులు... 11 పరుగులు చేస్తే బంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయం సాధిస్తుంది.
క్రీజులో బంగ్లా ఆటగాళ్లు ముష్ఫికుర్ రహీమ్, మహ్మదుల్లా ఉన్నారు. పాండ్యా వేసిన తొలి బంతికి మహ్మదుల్లా సింగిల్ తీశాడు. ఆపై రెండు బంతుల్లో రెండు ఫోర్లు. భారత అభిమానులు విజయంపై ఆశలు వదిలేసుకున్న వేళ, ఊహించని మలుపు తిరిగింది.

మ్యాచ్ని ఫినిష్ చేద్దామనుకున్న ముష్ఫికర్ నాలుగో బంతిని గాల్లోకి లేపాడు. డీప్ వికెట్లో ఉన్న ధావన్ దానిని క్యాచ్ పట్టుకున్నాడు. అయినా మ్యాచ్ బంగ్లాదేశ్ చేతుల్లోనే ఉంది. రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాలి. ఈ సమయంలో స్ట్రయికింగ్లో మహ్మదుల్లా ఉండటంతో విజయంపై ఆ జట్టుకు అనుమానాల్లేవ్.
ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్లో పాండ్యా ఐదో బంతిని పుల్ టాస్ వేశాడు. దీంతో మహ్మదుల్లా సింగిల్ కోసం ప్రయత్నించకుండా భారీ షాట్ ఆడాడు. బాల్ మళ్లీ గాల్లోకి లేచింది. ఈసారి డీప్ వికెట్లో ఉన్న జడేజా కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. దీంతో రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు పడ్డాయి. ఆపై మిగిలింది ఒక్క బంతి. దీన్ని ఎలా వేయాలి? ఈ సందేహం పాండ్యాకు వచ్చింది.

దీంతో టీమిండియా మైదానంలో గుమికూడింది. చివరి బంతికి సింగిల్ తీస్తే, మ్యాచ్ డ్రా అవుతుంది. సింగిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకపోతే, భారత్ గెలవవచ్చు. ఈ బాల్ ఎలా వేయాలన్న పాండ్యా ప్రశ్నకు స్పిన్నర్ అశ్విన్ సమాధానం ఇచ్చాడు. "ఓ బౌన్సర్ వేయాలన్నది నా ఆలోచన. ఎందుకంటే బౌన్సర్ ను కొట్టాలంటే చాలా కష్టం. అందులో కూడా లోయర్ ఆర్డర్లో వచ్చే వారు బౌన్సర్లు కొట్టలేరు" అని సలహా ఇచ్చాడు.
అశ్విన్ ఇచ్చిన సలహాను పాటించిన హార్దిక్ పాండ్యా బంతిని బ్యాట్స్మెన్కు దొరక్కుండా పైనుంచి వెళ్లేలా లోవర్ బౌన్స్ వేశాడు. దీంతో విజయం భారత్ సొంతమైంది. అశ్విన్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం ఆఖరి బంతికి ముందు జరిగిన విషయాన్ని మీడియా సమావేశంలో అశ్విన్ స్వయంగా వెల్లడించాడు.