కెప్టెన్గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
పింక్ బాల్ టెస్టులో కోహ్లీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నాడు. భారత్ తరుపున ఐదువేల పరుగు మైలురాయిని అందుకున్న తొలి కెప్టెన్గా కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు. పింక్ బాల్ టెస్టులో కోహ్లీ గనుక మరో 32 పరుగులు చేస్తే ఈ ఘనత సాధిస్తాడు. భారత్ తరుపున ఇప్పటి వరకు 83 టెస్టులు ఆడిన కోహ్లీ 7,066 పరుగులు చేశాడు. అయితే, కెప్టెన్గా టెస్టుల్లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 32 పరుగులు దూరంలో ఉన్నాడు. భారత్ తరుపున ఇప్పటివరకు 52 టెస్టు మ్యాచ్లకు సారథ్యం వహించిన కోహ్లీ 4,968 పరుగులు చేశాడు. మరో 32 పరుగులు చేస్తే టెస్టుల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న కెప్టెన్ల జాబితాలో చేరతాడు. అంతేకాదు భారత్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా నిలుస్తాడు.
బ్రాడ్మన్ రికార్డుని సమం చేయనున్న మయాంక్ అగర్వాల్
గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ ఇప్పటివరకు 8 టెస్టులాడి 71.50 యావరేజితో 858 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అయితే, మూడు సెంచరీల్లో రెండింటిని డబుల్ సెంచరీలుగా మలిచాడు. ఈడెన్ గార్డెన్స్లో బంగ్లాదేశ్తో చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్కు ముందు మయాంక్ అగర్వాల్ ఓ అద్భుతమైన రికార్డుపై కన్నేశాడు. టెస్టుల్లో వెయ్యి పరుగులు సాధించడానికి మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం 142 పరుగుల దూరంలో ఉన్నాడు. పింక్ బాల్ టెస్టులో మయాంక్ అగర్వాల్ గనుక ఈ పరుగులు సాధిస్తే ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్మన్ సర్ బ్రాడ్మన్ రికార్డుని సమం చేస్తాడు. సర్ బ్రాడ్మన్ కూడా టెస్టుల్లో 13 ఇన్నింగ్స్ల్లో వెయ్యి పరుగులు సాధించగా, ఇప్పుడు మయాంక్ను కూడా అదే రికార్డు ఊరిస్తోంది.
పుజారా, సాహా క్యాచ్ల రికార్డు
పింక్ బాల్ టెస్టులో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్ ఛటేశ్వర్ పుజారా మరో రెండు క్యాచ్లు పడితే టెస్టుల్లో 50 క్యాచ్లు అందుకున్న ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. ఇక, వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా గనుక ఒక డిస్మల్(క్యాచ్ లేదా స్టంపింగ్) చేస్తే టెస్ట్ క్రికెట్లో 100 అవుట్లను పూర్తి చేసిన వికెట్ కీపర్గా నిలుస్తాడు. అంతేకాదు భారత్ తరుపున ఈ ఘనత సాధించిన ఐదో వికెట్ కీపర్గా గుర్తింపు పొందుతాడు. పింక్ బాల్ టెస్టులో సాహా, పుజారాలు ఈ ఘనతలు అందుకోవాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
డే నైట్ టెస్టు టైమింగ్
మ్యాచ్ను మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమవుతుంది. తొలి సెషన్ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. లంచ్ విరామం నలభై నిమిషాలు, అనంతరం 3:40 గంటలకు ప్రారంభమయ్యే రెండో సెషన్ 5:40వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 20 నిమిషాలు టీ విరామం ఉంటుంది. ఆఖరి సెషన్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది.
లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్
భారత్-బంగ్లాదేశ్ చారిత్రాత్మక డే నైట్ టెస్ట్ మ్యాచ్ని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. ఇక, హాట్ స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. డే నైట్ టెస్టుకు సంబంధించిన మొదటి మూడు రోజుల టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డే నైట్ టెస్టు మ్యాచ్ కోసం బెంగాల్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.