
హైదరాబాద్: ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టు సభ్యులు బంగ్లాదేశ్ సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. నవంబర్ 14 నుండి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్ కోసం అప్పుడే భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం రహానే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశాడు. ఆపై ప్రాక్టీస్ ప్రారంభించాడు.
సోమవారం రహానే ట్విటర్లో ఓ వీడియోను పోస్టు చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్న విషయాన్ని తెలిపాడు. 'కుటుంబంతో విలువైన సమయాన్ని గడిపా. ఇక కార్యాలయానికి తిరిగి రావడానికి సమయం ఆసన్నమైంది' అని పేర్కొన్నాడు. మూడేళ్ల తర్వాత భారత్ గడ్డపై టెస్టుల్లో రహానే మళ్లీ సెంచరీ చేసాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రాంచీ టెస్టులో 14 ఫోర్లు, ఒక సిక్స్ బాదిన రహానే.. టెస్టు కెరీర్లో 11వ శతకాన్ని నమోదు చేశాడు. ఈ సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్ ఆడిన రహానే 216 పరుగులు చేసాడు.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆడుతుండగా.. రహానే భార్య రాధిక అక్టోబర్ 5న ఓ పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని హర్భజన్ ట్వీట్ చేయగా.. అభిమానులు అభినందనలు తెలిపారు. మ్యాచ్ పూర్తయ్యాక ఇంటికి చేరుకున్న రహానే తన పాపని ఎత్తుకొని ఆనందిస్తున్న ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. ఆ తర్వాత పూణే, రాంచీ టెస్టు మ్యాచ్లు ఆడాడు. టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం దాదాపు వారం పాటు ఫ్యామిలీతో గడిపిన రహానే.. మళ్లీ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు.
నవంబర్ 3 నుండి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. నవంబర్ 14 నుండి టెస్ట్ సిరీస్ మొదలవనుంది. దక్షిణాఫ్రికా సిరీస్లో నిరూపించుకున్న రహానే.. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్లోనూ సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబంతో గడుపుతున్నాడు. తీరిక లేని క్రికెట్ ఆడుతున్న అతడు టీ20 సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. కోహ్లీ మళ్లీ టెస్ట్ సిరీస్లో జట్టుతో కలుస్తాడు.