ఇండోర్: రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ హోల్కర్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీమిండియాకు షాక్ తగిలింది. రెండో రోజు ఛతేశ్వర పుజారా దూకుడుగా ఆడాడు. కేవలం 68 బంతుల్లలోనే అర్ధ సెంచరీ చేసాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లో అబూ జయేద్ చేతికి చిక్కి పుజారా (54) పెవిలియన్ చేరాడు.
పుజారా అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపే ప్రయత్నం చేసాడు. బౌండరీలు బాదుతూ అర్ధ సెంచరీ చేసాడు. అయితే స్కోర్ వేగం పెరిగే క్రమంలో కోహ్లీ (0) డకౌట్ అయ్యాడు. అబూ జయేద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. హోమ్ టెస్టుల్లో స్కోరు చేయకుండా విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరడం ఇది మూడోసారి మాత్రమే. అనంతరం అంజిక్య రహానేతో కలిసి మయాంక్ భారత స్కోరును పెంచుతున్నాడు.
మరోవైపు రహానే కూడా మూడు బౌండరీలు బాది మంచి ఊపులో ఉన్నాడు. ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నారు. భారత్ 37 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ (62), అంజిక్య (14) ఉన్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (6) మొదటి రోజే పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే.
గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత పేస్ త్రయం ధాటికి బంగ్లాదేశ్ తొలి రోజే చాప చుట్టేసింది. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ఆరంభంలోనే ప్రత్యర్థి పతనానికి బాటలు వేయగా.. ఆ తర్వాత రివర్స్ స్వింగ్తో పేసర్ మహ్మద్ షమీ బెంబేలెత్తించాడు. షమీ (3/27), ఇషాంత్ (2/20), ఉమేశ్ (2/47) నిప్పులు చెరగడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో షమీ హ్యాట్రిక్ తీసే అవకాశాన్ని కోల్పోయాడు. బంగ్లా ఇన్నింగ్స్లో భాగంగా 54 ఓవర్ ఐదో బంతికి ముష్ఫికర్ రహీమ్ వికెట్ తీసిన షమీ.. ఆ మరుసటి బంతికి మెహిదీ హసన్ ఔట్ చేసాడు. అనంతరం టీ బ్రేక్ రాగా.. షమీని హ్యాట్రిక్ ఊరించింది. 56వ ఓవర్లో హ్యాట్రిక్ సాధిస్తాడేమోనని ఎదురుచూసినా.. అది సాధ్యం కాలేదు. తైజుల్ ఇస్లామ్ విజయవంతంగా బంతిని డిఫెండ్ చేశాడు.