
హైదరాబాద్: వన్డే, టెస్టుల్లోకి ఎంపిక చేసే ముందు యువ క్రికెటర్లను పరీక్షించేందుకు టీ20లు మంచి అవకాశమని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. టెస్టులు, వన్డేలతో పోలిస్తే టీ20ల్లో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ ఏడాది స్వదేశంలో టీమిండియా ఒక్క టీ20 సిరిస్లో విజయం సాధించలేదు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరిస్లో 0-2తో సిరిస్ను చేజార్చుకున్న టీమిండియా... ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టీ20ల సిరిస్ను 1-1తో సమం చేసుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
రాజ్కోట్ వేదికగా గురువారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో రెండో టీ20కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ "యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు మేం ఎంచుకున్న ఫార్మాట్ ఇది. కీలక ఆటగాళ్లు లేకపోవడంతో యువకులను ప్రయత్నిస్తున్నాం" అని అన్నాడు.
"ఓటమికి ఇది కూడా ఓ కారణం. యువ క్రికెటర్లు తమను తాము వ్యక్తీకరించుకునేందుకు మరియు వన్డేలు, టెస్టులకు సిద్ధమవుతారు. టీ20ల్లో యువకులను పరీక్షించడంలో జట్టుకు హాని లేదు. ఎందుకంటే మిగతా ఫార్మాట్లలో మేం పటిష్ట జట్టుతో బరిలోకి దిగుతాం. ఈ ఫార్మాట్లో సత్తాచాటి ఎంతోమంది వన్డే, టెస్టులకు ఎంపికయ్యారు" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
"మా రిజర్వ్బెంచ్ సాధ్యమైనంత పటిష్టంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కారణం చేతనే చాలా మంది యువ క్రికెటర్లకు ఈ ఫార్మాట్లో ఆడుతుండటాన్ని మీరు చూస్తున్నారు. మేం మ్యాచ్లు గెలవక తప్పదు. ఓటముల నుంచి యువ క్రికెటర్లు చాలా నేర్చుకుంటారు" అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 నవంబర్ 7న రాజ్ కోట్ వేదికగా జరగనుంది. దీంతో రెండో టీ20లో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేయాలనే గట్టి పట్టుదలతో రోహిత్ సేన ఉంది.