జట్టులోకి సంజు శాంసన్
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఫేవరెట్గా భావించిన టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో పూర్తిగా నిరాశపరిచింది. అయితే రెండో టీ20లో గెలిస్తేనే భారత్ సిరీస్ రేసులో నిలుస్తుంది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులో రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి టీ20 మ్యాచ్లో విఫలమయిన కేఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఖలీల్ స్థానంలో శార్దూల్
19వ ఓవర్లో వరుసగా నాలుగు బౌండరీలు ఇచ్చి టీమిండియాకు విజయాన్ని దూరం చేసిన పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ రానున్నాడు. దీపక్ చాహర్, యుజువేంద్ర చహల్ తమ స్థానాలను నిలుపోకోనున్నారు. బ్యాట్తో మెరిసిన వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యాలు కూడా కొనసాగనున్నారు. తొలి మ్యాచ్ ఆడిన శివమ్ దుబేకు మరో అవకాశం దక్కనుంది. విఫలమయినా రిషబ్ పంత్ కీపర్ స్థానంలో ఉంటాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ భారం మోయనున్నారు.
రెండు మార్పులు
మొత్తానికి టీమిండియా రెండో టీ20 కోసం రెండు మార్పులు చేయనుంది. కేఎల్ రాహుల్ స్థానంలో సంజు శాంసన్.. ఖలీల్ అహ్మద్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు మార్పులు తప్పితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే కెప్టెన్, కోచ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
సైక్లోన్ మహా ముప్పు
ఢిల్లీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ను వాయు కాలుష్యం ఇబ్బందిపెట్టగా.. రెండో టీ20ని సైక్లోన్ మహా అడ్డుకునే అవకాశం ఉంది. అయితే సైక్లోన్ మహా హెచ్చరికలు ఉన్నా.. భారత్-బాంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం మంగళవారం స్పష్టం చేసింది. మ్యాచ్ జరిగే రోజు ఉదయం వర్షం పడినా తక్కువ సమయంలోనే మ్యాచ్ నిర్వహణకు స్టేడియాన్ని సిద్ధం చేయగలం అని పేర్కొంది.
భారత తుది జట్టు
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కృనాల్ పాండ్యా, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చహల్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్.