వర్షం ముప్పు:
ఢిల్లీ మ్యాచ్ను వాతావరణ కాలుష్యం భయపెడితే.. రాజ్కోట్ టీ20కి మహా తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బుధవారం సాయంత్రం కూడా రాజ్కోట్లో భారీ వర్షం కురిసింది. ఇక మ్యాచ్ జరిగే గురువారం తుపాను గుజరాత్ తీరం దాటే అవకాశం ఉండడంతో రాజ్కోట్లో భారీ వర్షం పడొచ్చు. అయితే గురువారం మధ్యాహ్నంకల్లా తుఫాన్ బలహీన పడుతుందని, సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళలో మాత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయట.
మ్యాచ్ రద్దయితే పెద్ద ఎదురుదెబ్బ:
ఒకవేళ మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. సిరీస్ గెలిచే అవకాశం లేకపోగా.. చివరి టీ20లో సిరీస్ సమం కోసం ఒత్తిడి మధ్య పోటీకి దిగాల్సి వస్తుంది. ఈ సమీకరణాలను చూస్తే.. మ్యాచ్ సమయానికి వరుణుడు కరుణించాలని టీంఇండియా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ రోజు వరణుడు ఏం చేస్తాడో చూడాలి.
భారీ స్కోర్లు:
రాజ్కోట్ పిచ్పై 2017లో న్యూజిలాండ్ 196/2 స్కోరు చేసింది. 2013లో ఆస్ట్రేలియా 201/7 స్కోరు చేసింది. రెండుసార్లు ఆ జట్లు తొలిసారి బ్యాటింగ్ చేశాయి. ఇక్కడ జరిగిన ఆ రెండు మ్యాచ్ల్లో కివీస్తో ఓడిన భారత్.. ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈసారి కూడా పిచ్ బ్యాటింగ్కే అనుకూలంగా కనిపిస్తోంది కాబట్టి మళ్లీ పరుగుల ప్రవాహం చూసే వీలుంది.
|
హెచ్చరికలు ఉన్నా మ్యాచ్ నిర్వహిస్తాం:
సైక్లోన్ మహా హెచ్చరికలు ఉన్నా.. భారత్-బాంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్పష్టం చేసింది. మ్యాచ్ జరిగే రోజు ఉదయం వర్షం పడినా తక్కువ సమయంలోనే మ్యాచ్ నిర్వహణకు స్టేడియాన్ని సిద్ధం చేయగలం అని పేర్కొంది.
రోహిత్ @ 100:
'రాజ్కోట్ పిచ్ బాగుంది. ఈ వికెట్ బ్యాటింగ్కు అనుకూలం. పెద్ద స్కోర్లు ఖాయం. పొట్టి ఫార్మాట్ కొత్త ఆటగాళ్లను పరీక్షించేందుకు అనుకూలంగా ఉంటుంది. వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు రిజర్వ్బెంచ్ సత్తా పెంచడమే లక్ష్యం. గత 12 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశా. వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతున్నా' అని రోహిత్ శర్మ అన్నాడు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ భారత్ తరఫున 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడనున్న తొలి క్రికెటర్గా గుర్తింపు పొందనున్నాడు.