8 పరుగులు చేస్తే:
ఈ టీ20 సిరీస్లో రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో మొదటి స్థానం కోసం ఇద్దరు పోటీపడుతున్నారు. 2,450 పరుగులతో కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా.. 2,443 పరుగులతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి టీ20లో రోహిత్ 8 పరుగులు చేస్తే నంబర్వన్ స్థానాన్ని ఆక్రమిస్తాడు. కోహ్లీ 72 మ్యాచుల్లో 50 సగటుతో 2,450 పరుగులు చేస్తే.. రోహిత్ 98 మ్యాచుల్లో 32.14 సగటుతో 2,443 పరుగులు చేసాడు.
ఒక హాఫ్ సెంచరీ చేస్తే కోహ్లీ సరసన:
అంతర్జాతీయ టీ20ల్లో 50కి పైగా పరుగులు సాధించిన జాబితాలో కూడా కోహ్లీ, రోహిత్ పోటీపడుతున్నారు. కోహ్లీ 22 హాఫ్ సెంచరీలతో ముందంజలో ఉండగా.. రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ నాలుగు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేసాడు. అంటే.. యాభైకి పైగా పరుగుల్ని 21 సందర్భాల్లో సాధించాడు. ఒక హాఫ్ సెంచరీ చేస్తే.. కోహ్లీ సరసన చేరతాడు. ఇక ఈ సిరీస్లో రోహిత్ రెండు హాఫ్ సెంచరీలు చేస్తే.. కోహ్లీ రికార్డు బద్ధలు కానుంది.
కోహ్లీకి విశ్రాంతి:
ప్రపంచకప్ అనంతరం విరాట్ కోహ్లీ ఎడతెరపి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. అతడి పని భారాన్ని తగ్గించడానికి బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. ఇక జట్టు బాధ్యతలను రోహిత్కు అప్పగించారు. ధోనీ లాగే టీ20 క్రికెట్లో రోహిత్కు మంచి రికార్డు ఉంది. ధోనీలా కూల్ కెప్టెన్సీ, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. దీంతోనే ఐపీఎల్ ప్రాంచైజీ ముంబయి ఇండియన్స్ను నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. రోహిత్ జట్టును ముందుండి నడిపిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఢిల్లీలో తీవ్ర కాలుష్యం:
ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం అధికంగా ఉంది. ఢిల్లీ కాలుష్యం నీడలో తొలి టీ20 మ్యాచ్ జరగడంపైనే అందరి దృష్టి నెలకొంది. పొగమంచుతో కమ్మేసిన నగరంలో మూడు గంటలకుపైగా ఆటగాళ్లు ప్రత్యర్థితో పాటు వాతావరణంతో కూడా పోటీ పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం ఆటగాళ్లపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.