కాన్బెర్రా: మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు కంకషన్ సబ్స్టిట్యూట్గా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మైదానంలోకి వచ్చాడు. టీమిండియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బౌన్సర్.. జడేజా హెల్మెట్కు బలంగా తాకింది. దీంతో అతడు కంకషన్కు గురైయ్యాడు. చికిత్స అనంతరం బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జడేజా స్థానంలో చహల్ మైదానంలోకి వచ్చాడు.
ప్రస్తుతం రవీంద్ర జడేజా ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పరిశీలిస్తోందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన చహల్ బంతితో మాయ చేస్తున్నాడు. కట్టుదిట్టంగా బంతులు వేసి.. ఆసీస్ బ్యాట్స్మెన్ను కట్టడిచేస్తున్నాడు. రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. కీలక బ్యాట్స్మెన్ ఆరోన్ ఫించ్ (35), స్టీవ్ స్మిత్ (12) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు ఓవర్లలో రెండు వికెట్లు తీసి 19 రన్స్ ఇచ్చాడు.
ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం కాంకషన్ సబ్స్టిట్యూట్కు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఓ ప్లేయర్కు కాంకషన్ సబ్స్టిట్యూట్ను ఇవ్వాలంటే అతనికి వెంటనే టెస్ట్ నిర్వహించాలి. ఆ తర్వాత అతడు ఆడకూడదు. అయితే జడేజాకు మాత్రం గాయమైన సమయంలో కాంకషన్ టెస్ట్ నిర్వహించలేదు. ఆ తర్వాత కూడా అతను బ్యాటింగ్ కొనసాగించి 3 బంతుల్లో 9 పరుగులు చేశాడు. జడేజా (44 నాటౌట్: 23 బంతుల్లో 5x4, 1x6) విధ్వంసం సృష్టించడంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
ఆరు పరుగుల వ్యవధిలోనే శాంసన్, మనీష్ పాండే, కేఎల్ రాహుల్ ఔటవ్వడంతో భారత్ 92 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్యా ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయాడు. అయితే ఇన్నింగ్స్ చివరలో రవీంద్ర జడేజా విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి ధాటికి ఆఖరి మూడు ఓవర్లలో భారత్ 46 పరుగులు పిండుకుంది.
India vs Australia: కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. కోహ్లీ, ఫించ్ సరసన!!