
సిడ్నీ: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఎట్టకేలకి ఫిట్నెస్ సాధించాడు. సిడ్నీ ఒలింపిక్ పార్క్ మైదానంలో బుధవారం సాహా నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. భారత సహాయక సిబ్బంది త్రో బంతులు విసరగా.. చక్కగా బ్యాటింగ్ చేశాడు. సాహా బ్యాటింగ్ ప్రాక్టీస్కు సంబందించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఈ రోజు నెట్స్లో ఎవరు బ్యాటింగ్ చేస్తున్నారో చూడండి' అని బీసీసీఐ కాప్షన్ పెట్టింది. నవంబర్ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.
యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్గా ఆడిన వృద్ధిమాన్ సాహా రెండు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు బాది ఆ జట్టుని గెలిపించాడు. ఐపీఎల్ 13వ సీజన్లో 4 మ్యాచ్లాడిన సాహా 139.86 స్ట్రైక్రేట్తో 214 పరుగులు చేశాడు. ఇందులో 24 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే తొడ కండరాల గాయంతో ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్కి అతడు దూరంగా ఉన్నాడు. దీంతో సన్రైజర్స్ బ్యాటింగ్ విభాగంలో విఫలమై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
వృద్ధిమాన్ సాహాకు గాయం అయినా.. ఆస్ట్రేలియాతో డిసెంబరు 17 నుంచి ప్రారంభంకానున్న నాలుగు టెస్టుల సిరీస్కి వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు. అప్పటిలోగా ఫిట్నెస్ సాధిస్తాడని బీసీసీఐ సెలెక్టర్లు భావించి అతడిని ఎంపిక చేశారు. అయితే సిరీస్ ఆరంభానికి ముందే అతను ఫిట్నెస్ సాధించడంపై మాజీ క్రికెటర్లు సందేహం వ్యక్తం చేశారు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సాహా నెట్స్లో ప్రాక్టీస్ని ప్రారంభించాడు. అద్భుతంగా బంతిని బాదుతున్నాడు కూడా.
వృద్ధిమాన్ సాహా ఫిట్నెస్ సాధించడంతో.. రెండో వికెట్ కీపర్గా ఎంపికైన రిషబ్ పంత్కు షాక్ తగలనుంది. ఈ సిరీస్లో అతడు రిజర్వ్ బెంచ్కే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్లో 14 మ్యాచ్లాడిన పంత్ 113.95 స్ట్రైక్రేట్తో 343 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఆహా అనిపించే ఒక్క ఇన్నింగ్స్ ఆడలేలేదు. తనకు అలవాటైన షాట్తో వికెట్ చేజార్చుకుని పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యాడు. కీలక ఆసీస్ పర్యటన నేపథ్యంలో తుది జట్టులో పంత్ను ఆడించే సాహసం విరాట్ కోహ్లీ చేయకపోవచ్చు.