మంచి భాగస్వామ్యం నిర్మించాలనుకున్నాం:
'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికైన విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, నేను అనుభవజ్ఞులం. అయితే ధావన్ సేవలు కొల్పోయాం. లక్ష్య చేధనలో మంచి ఆరంభం లభించింది. రోహిత్, రాహుల్ శుభారంభం ఇచ్చారు. రాహుల్ ఔటయ్యాక.. రోహిత్, నేను మంచి భాగస్వామ్యం నిర్మించాలనుకున్నాం. రాహుల్ ఔటయ్యే సమయానికి బంతి తిరుగుతుంది, అలాంటప్పుడు తమ అనుభవంతో ఓపికగా ఆడాలనుకున్నాం' అని కోహ్లీ అన్నాడు.
రోహిత్ బాగా ఆడాడు:
'ఆసీస్కు వికెట్లు ఇవ్వకపోతే ఆ తర్వాత ఓవర్కు 7-8 పరుగులు చేయోచ్చనే ముందే ప్రణాళిక వేసుకున్నాం. అదే అమలు చేసాం. రోహిత్ ఈ రోజు బాగా ఆడాడు. గత నాలుగైదేళ్లుగా ఇలాగే ఆడుతున్నాన్నాం. ఒకరు ఆడుతుంటే మరొకరు సహకరించుకోవాలని ముందే ప్రణాళిక రచించుకున్నాం. రోహిత్కు మొదటగా సహకరించా. ఆ తర్వాత అతడు రెచ్చిపోయాడు. ఏదైమైనా ఆసీస్పై పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్ విజయం సాధించాలనే బరిలోకి దిగాం' అని కోహ్లీ తెలిపాడు.
ఆ షాట్ను చాలా ఆనందించా:
'మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఆడిన కవర్ డ్రైవ్ షాట్ను నేను ఆనందించాను. నెట్స్లో ప్రాక్టీస్ చేయడంతోనే ఆ షాట్ ఆడగలిగా. షార్ట్ పిచ్ బంతుల గురించి ఆందోళన చెందను. నా టెక్నిక్ను మాత్రమే నమ్ముకుంటా. అదే నన్ను నమ్మకంగా షాట్లు ఆడేలా చేస్తోంది. అన్నిటికంటే ముందు సానుకూలంగా ఉండటం ముఖ్యం' అని కోహ్లీపేర్కొన్నాడు.
సిరీస్ గెలవడం సంతృప్తికరంగా ఉంది:
'గతేడాది పర్యటించిన జట్టు కంటే ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు చాలా మెరుగ్గా ఉంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబ్షేన్లు జట్టులోకి వచ్చారు. మరోవైపు నాణ్యమైన బౌలింగ్ దాడి, మంచి ఫిల్డింగ్ కూడా ఉంది. మొదటి వన్డేలో ఓడిపోయినా.. రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతృప్తికరంగా ఉంది. గత పర్యటనలో మొదటి రెండు మ్యాచ్లు గెలిచి కూడా సిరీస్ ఓడాం. సిరీస్ను తిరిగి పొందడం నిజంగా సంతృప్తికరంగా ఉంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
కోహ్లీ అర్ధ శతకం:
తొలుత బ్యాటింగ్ చేసి ఆ్రస్టేలియా 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. స్మిత్ (132 బంతుల్లో 131; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా, లబ్షేన్ (64 బంతుల్లో 54; 5 ఫోర్లు) రాణించాడు. భారత పేసర్ షమీ 4 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా 47.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ (128 బంతుల్లో 119; 8 ఫోర్లు, 6 సిక్స్లు) శతకం, కోహ్లీ (91 బంతుల్లో 89; 8 ఫోర్లు) అర్ధ శతకం చేసారు.